
హైదరాబాద్: 100 బంతుల ఫార్మాట్ వల్ల మంచి జట్టుకు.. సాధారణ జట్టుకు అంతరం తగ్గిపోతుందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ఐదు రోజుల టెస్టు మ్యాచ్ చూసే ఓపిక క్రికెట అభిమానులకు లేదని వన్డే ఫార్మాట్ తీసుకొచ్చారు.
వన్డే ఫార్మాట్కు కూడా పెద్దది అయిపోయిందని టీ20 క్రికెట్ను తీసుకొచ్చారు. అయితే, టీ20 క్రికెట్ బాగా సక్సెస్ అయింది. తాజాగా దీనిని తగ్గించి ఇన్నింగ్స్కు 100 బంతులు ఉండేలా మ్యాచ్ నిర్వహించే ప్రతిపాదనను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చేసింది.
ఈ ప్రతిపాదన ప్రకారం 15 ఓవర్ల వరకు ఓవర్కు ఆరు బంతులు వేయించి, పది బంతులతో చివరి ఓవర్ ఉండేలా ఈ కొత్త ఫార్మాట్ను రూపొందించింది. అంతేకాదు 2020లో ఎనిమిది జట్లతో ఈ ఫార్మాట్లో టోర్నీ ఆడించడానికి ఇంగ్లాండ్ బోర్డు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన సౌరవ్ గంగూలీ ఈ ఫార్మాట్పై విముఖత వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ 'ప్రేక్షకుడు కన్ను మూసి తెరిచే లోపు మ్యాచ్ అయిపోతే ఎలా? కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫార్మాట్ కుదించే కొద్దీ మంచి జట్టుకు.. సాధారణ జట్టుకు మధ్య మధ్య అంతరం తగ్గిపోతుంది' అని అన్నాడు.
'వీక్షకుడు నిర్ణీత సమయంలో ఆటను ఆస్వాదించాలనుకుంటాడు. నిజమైన ప్రతిభ చూడాలని, అసలైన విజేతలే గెలవాలని కోరుకుంటాడు. ఆటను ఇంకెంతగా కుదించేస్తారో చూడాలి' అని గంగూలీ తన అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. రష్యా ఆతిథ్యమిస్తోన్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి తాను హాజరవుతున్నట్లు గంగూలీ ఈ సందర్భంగా వెల్లడించాడు.