|
ఆసక్తికరమైన విషయం ఏంటంటే..?
ఐపీఎల్ 2011 సీజన్కు సంబంధించి జరిగిన వేలంలో క్రిస్ గేల్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే టీమ్లో ఓ ప్లేయర్ గాయపడటంతో ఆర్సీబీ గేల్ను జట్టులోకి తీసుకొచ్చింది. ఇక ఆర్సీబీ తరఫున ఫస్ట్ మ్యాచ్ను గేల్.. కోల్కతా నైట్రైడర్స్తో ఆడాడు. అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీతో రాణించి తాను ఎంత విలువైన ఆటగాడినో ఫ్రాంచైజీలన్నిటికీ తెలియజేశాడు. ఆ సీజన్లో మొత్తం 12 మ్యాచ్లు ఆడిన గేల్.. 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 608 రన్స్ చేసాడు.
కోహ్లీ సాయంతో..
ఇక పదేళ్ల క్రితం ఇదే రోజు కోల్కతాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సాయంతో గేల్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 రన్స్ చేసింది. నాటి కెప్టెన్ గౌతం గంభీర్(48), జాక్వస్ కల్లీస్(40), యూసఫ్ పఠాన్(46) రాణించారు. అనంతరం ఆర్సీబీ 18.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది.
కేకేఆర్ బౌలర్ అబ్దుల్లా వేసిన 18వ ఓవర్ ఫస్ట్ బాల్ను కోహ్లీ బౌండరీకి తరలించడంతో ఆర్సీబీ విజయానికి 17 బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి. గేల్ అప్పటికే 98 పరుగులతో నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు. దాంతో మిగిలిన 5 బంతులను కోహ్లీ డిఫెన్స్ చేయగా.. అబ్దుల్లా ఒక వైడ్ వేసాడు. దాంతో 12 బంతుల్లో 1 పరుగు కావాల్సి ఉండగా.. షకీబ్ వేసిన 19వ ఓవర్ తొలిబంతిని బౌండరీ కొట్టిన గేల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టైటిల్ జస్ట్ మిస్
2011 సీజన్లో సూపర్ పెర్ఫామెన్స్తో అదరగొట్టిన ఆర్సీబీ.. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. 14 లీగ్ మ్యాచ్ల్లో 9 గెలిచి టేబుల్ టాపర్గా నిలిచిన డానియల్ వెటోరి నేతృత్వంలోని ఆర్సీబీ.. ఫైనల్లో సీఎస్కే చేతిలో 58 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ టైటిల్ ఫైట్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 రన్స్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మురళీ విజయ్(95), మైకేల్ హస్సీ(63), ధోనీ(22) మెరుపులు మెరిపించారు. అనంతరం ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 రన్స్ చేసింది. సౌరభ్ తివారి(42 నాటౌట్), విరాట్ కోహ్లీ(35) మినహా అంతా విఫలమయ్యారు.