సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ దుమ్మురేపుతోంది. ప్రత్యర్థులపై పంచ్లు కురిపిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్శిటీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్తో పాటు వరల్డ్కప్ గోల్డ్ మెడలిస్ట్ హితేష్ గులియా, వరల్డ్ ఛాంపియన్ మీనాక్షి హుడా విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు.
మహిళల 45-48 కేజీల విభాగంలో ఆలిండియా పోలీస్ తరఫున బరిలోకి దిగిన మీనాక్షి 5-0తో పంజాబ్ బాక్సర్ కాశిష్ మెహతాను ఓడించింది. మహిళల 48-51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 5-0తో మణిపూర్కు చెందిన లాంచెన్బీ చాను టోంగ్బ్రామ్ను చిత్తు చేసింది. మహిళల 51-54 కేజీల విభాగంలో ప్రీతి 5-0తో హర్మీత్ కౌర్పై, సాక్షి 4-1తో పూనమ్పై విజయం సాధించారు.

పురుషుల 65-70 కేజీల కేటగిరిలో హితేష్ 5-0తో పంజాబ్ బాక్సర్ తేజస్వినిని ఓడించి సెమీస్కు దూసుకెళ్లాడు. పురుషుల 50-55 కేజీల విభాగంలో వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ సిల్వర్ మెడలిస్ట్ పవన్ భార్త్వాల్, అరుణాచల్ ప్రదేశ్కు చెందిన టైసన్ను ఓడించగా, జదుమణి సింగ్ (50-55 కేజీలు) పంజాబ్ బాక్సర్ నిఖిల్ పై విజయం సాధించాడు. 55-60 కేజీల విభాగంలో సచిన్.. ఉత్తర ప్రదేశ్కు చెందిన కరణ్ను ఓడించి సెమీస్కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు కనీసం కాంస్య పతకం ఖాయం కానుంది.