
న్యూఢిల్లీ: మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత బాక్సర్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆమెతో పాటు నీతూ గాంగాస్ కూడా టైటిల్ ఫైట్కు అర్హత సాధించింది. గురువారం జరిగిన వేర్వేరు సెమీఫైనల్ బౌట్లలో భారత బాక్సర్లు ఇద్దరూ విజయం సాధించారు. 50 కేజీల కేటగిరిలో బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది.
సెమీఫైనల్ బౌట్లో నిఖత్ జరీన్ 5-0తో రియో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, కొలంబియా అమ్మాయి ఇంగ్రిట్ వాలెన్సిని ఓడించింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై పంచ్లు విసిరింది. నిఖత్ జరీన్ అద్వీతియ ప్రదర్శనకు ఐదుగురు జడ్జిలు ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించారు.
గతేడాదే చాంపియన్షిప్ గెలిచిన నిఖత్ జరీన్.. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలోని విజేతగా నిలిచి పారిస్ ఒలింపిక్స్ బరిలోకి దిగాలని భావిస్తోంది. మేరీ కోమ్ నీడలో ఎదిగిన నిఖత్ జరీన్.. గతేడాది నుంచే తన పంచ్ పవర్ను ప్రపంచానికి తెలియజేసింది. క్వార్టర్ఫైనల్లో 5-2తో థాయ్లాండ్కు చెందిన చుతామత్ రక్సాత్ను నిఖత్ ఓడించింది.
48 కేజీల విభాగంలోని సెమీఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీతూ గాంగాస్ 3-2తో మాజీ సిల్వర్ మెడిలిస్ట్, కజకిస్తాన్ బాక్సర్ అలువా బాల్కిబెకోవాను ఓడించింది. క్వార్టర్స్లో మడోక వాదా (జపాన్)ను చిత్తుచేసింది. దూకుడు మీదున్న 22 ఏళ్ల నీతు బౌట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆమె పంచ్లకు ప్రత్యర్థికి తట్టుకోలేకపోయింది. దీంతో రెండో రౌండ్లో బౌట్ను ఆపిన రిఫరీ నీతును విజేతగా ప్రకటించాడు. సెమీఫైనల్లో మాత్రం నీతూ గాంగాస్ విజయం కోసం కష్టపడాల్సి వచ్చింది.

75 కేజీల కేటగిరి సెమీఫైనల్లోలో భారత బాక్సర్ లవ్లీనా బోర్గహైన్ 4-1తో లి క్వియాన్ను ఓడించి సిల్వర్ మెడల్ ఖాయం చేసింది. లవ్లీనా ఆద్యంతం ఆదిపత్యాన్ని ప్రదర్శించి మూడో ప్రపంచ ఛాంపియన్షిప్స్ మెడల్ను ఖాయం చేసుకుంది. 81 కేజీల కేటగిరిలో మరో భారత బాక్సర్ స్వీటీ బూరా కూడా విజయం దిశగా దూసుకెళ్తోంది.