
న్యూఢిల్లీ: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే భారత బాక్సర్ నీతూ గంగాస్ స్వర్ణ పతకం సాధించగా.. తాజాగా సావిటీ బూరా కూడా గోల్డ్ మెడల్ సాధించింది.
శనివారం జరిగిన 81 కిలోల విభాగం ఫైనల్లో హరియాణాకు చెందిన సావిటీ బూరా 4-3తో చైనాకు చెందిన వాంగ్ లినాపై గెలుపొందింది. 2014లో ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న 30 ఏళ్ల సావిటీ... ఈ సారి పట్టుదలతో పసిడిని ఒడిసి పట్టింది. అంతకుముందు సెమీస్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్వా నుంచి కఠిన సవాల్ ఎదుర్కొన్న సావిటీ.. తాజాగా 4-3 తేడాతో విజయం సాధించింది.
ఇదే టోర్నీలో 48 కిలోల విభాగంలో నీతూ గాంగాస్ మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్పై 5-0 తేడాతో విజయం సాధించింది. భారత్కు చెందిన మేరీకోమ్ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, నిఖత్ జరీన్ ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించగా.. ఇప్పుడు ఆ జాబితాలో నీతూ,సావిటీ బూరా కూడా చేరారు.
ఈ ఇద్దరితోతో పాటు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, ఒలింపిక్స్ విజేత లవ్లీనా బోర్గహైన్ కూడా ఫైనల్ చేరారు. నిఖత్ జరీన్, లవ్లీనా ఫైనల్ బౌట్లు ఆదివారం జరగనున్నాయి. 75 కేజీల కేటగిరి సెమీఫైనల్లో లవ్లీనా బోర్గహైన్ 4-1తో లి క్వియాన్ను ఓడించి సిల్వర్ మెడల్ ఖాయం చేసింది. లవ్లీనా ఆద్యంతం ఆదిపత్యాన్ని ప్రదర్శించి మూడో ప్రపంచ ఛాంపియన్షిప్స్ మెడల్ను ఖాయం చేసుకుంది.
50 కేజీల కేటగిరి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ 5-0తో రియో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, కొలంబియా అమ్మాయి ఇంగ్రిట్ వాలెన్సిని ఓడించింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై పంచ్లు విసిరింది. నిఖత్ జరీన్ అద్వీతియ ప్రదర్శనకు ఐదుగురు జడ్జిలు ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించారు.