
న్యూఢిల్లీ: మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ నీతూ గంగాస్ చాంఫియన్గా నిలిచింది. 48 కేజీల విభాగంలో నీతూ స్వర్ణం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో నీతూ గంగాస్ 5-0తో మంగోలియా బాక్సర్ లుత్సాయిఖాన్పై గెలుపొందింది. గతేడాది స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీతో పాటు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు కొల్లగొట్టిన నీతూ.. తాజాగా బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచింది. భారత్కు చెందిన మేరీకోమ్ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, నిఖత్ జరీన్ ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించగా.. ఈ జాబితాలో నీతూ సైతం చేరింది.
సెమీఫైనల్లో నీతూ గాంగాస్ 3-2తో మాజీ సిల్వర్ మెడిలిస్ట్, కజకిస్తాన్ బాక్సర్ అలువా బాల్కిబెకోవాను ఓడించింది. క్వార్టర్స్లో మడోక వాదా (జపాన్)ను చిత్తుచేసింది. దూకుడు మీదున్న 22 ఏళ్ల నీతు బౌట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆమె పంచ్లకు ప్రత్యర్థికి తట్టుకోలేకపోయింది. దీంతో రెండో రౌండ్లో బౌట్ను ఆపిన రిఫరీ నీతును విజేతగా ప్రకటించాడు. సెమీఫైనల్లో మాత్రం నీతూ గాంగాస్ విజయం కోసం కష్టపడాల్సి వచ్చింది. సెమీఫైనల్ మినహా మిగతా అన్ని బౌట్లలో నీతూ గంగాస్ ఏకపక్ష విజయాలు సాధించింది. క్వార్టర్స్ వరకు తన పంచ్ పవర్తో ప్రత్యర్థులను రెండో రౌండ్లోనే మట్టికరిపించి విజయాలందుకుంది.
నీతూ గంగాస్తో పాటు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, ఒలింపిక్స్ విజేత లవ్లీనా బోర్గహైన్, సావిటీ బూరా కూడా ఫైనల్ చేరింది. సావిటీ బూరా ఫైనల్ బౌట్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుండగా.. నిఖత్ జరీన్, లవ్లీనా ఫైనల్ బౌట్లు ఆదివారం జరగనున్నాయి. 75 కేజీల కేటగిరి సెమీఫైనల్లో లవ్లీనా బోర్గహైన్ 4-1తో లి క్వియాన్ను ఓడించి సిల్వర్ మెడల్ ఖాయం చేసింది. లవ్లీనా ఆద్యంతం ఆదిపత్యాన్ని ప్రదర్శించి మూడో ప్రపంచ ఛాంపియన్షిప్స్ మెడల్ను ఖాయం చేసుకుంది.
50 కేజీల కేటగిరి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ 5-0తో రియో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, కొలంబియా అమ్మాయి ఇంగ్రిట్ వాలెన్సిని ఓడించింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై పంచ్లు విసిరింది. నిఖత్ జరీన్ అద్వీతియ ప్రదర్శనకు ఐదుగురు జడ్జిలు ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించారు.