
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల బాక్సింగ్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ ముద్దు బిడ్డ, డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ సత్తా చాటుతోంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శనతో సెమీఫైనల్కు దూసుకెళ్లిన మన ఇందూర్ బిడ్డ మెడల్ ఖాయం చేసింది. నిఖత్ జరీన్తో పాటు నీతూ గంగాస్, సావీటీ బూరా కూడా సెమీఫైనల్ చేరి భారత్కు మూడు పతకాలు ఖాయం చేశారు.
బుధవారం జరిగిన వేర్వేరు క్వార్టర్స్ బౌట్లలో ప్రత్యర్థులపై విజయాలతో నిఖత్ జరీన్, నీతూ గంగాస్, సావీటీ బూరా పతక వేటలో ముందంజ వేశారు.
మహిళల 50కిలోల విభాగంలో బరిలోకి దిగిన నిఖత్ 5-2 తేడాతో థాయిలాండ్కు చెందిన చుతామత్ రక్షత్పై గెలుపొందింది. హోరాహోరీ సాగిన ఈ పోరులో భారత బాక్సర్దే పైచేయి అయ్యింది. న్యాయ నిర్ణేతలను సవాల్ చేసి థాయ్లాండ్ బాక్సర్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. థాయ్ లాండ్ బాక్సర్ గత రెండు చాంపియన్షిప్ల్లో కాంస్య పతకాలు సాధించినా.. ఈసారి నిఖత్ ముందు నిలవలేకపోయింది.సెమీఫైనల్లో నిఖత్ జరీన్.. రియో ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, కొలంబియా బాక్సర్ ఇంగ్రిట్ వాలెన్సియాతో తలపడనుంది.
మరోవైపు 48కేజీల విభాగంలో బరిలోకి దిగిన నీతూ గంగాస్ జపాన్ బాక్సర్ మడోకా వాడాకును మట్టికరిపించింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై పంచ్ల వర్షం కురిపించడంతో రెండో రౌండ్లో రిఫరీ బౌట్ను నిలపివేసి ఆర్ఎస్సీ(రిఫీ స్టాప్స్ కాంటెస్ట్) ద్వారా నీతూ గంగాస్ను విజేతగా ప్రకటించాడు. ఈ టోర్నీల్లో నీతూ ఆర్ఎస్సీ ద్వారానే మూడు బౌట్లల్లో విజయం సాధించడం విశేషం.
81 కేజీల విభాగంలో బరిలోకి దిగిన సావీటీ బూరా 5-0తో బెలారస్కు చెందిన బాక్సర్ విక్టోరియా కెబికావాను మట్టికరిపించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బాక్సర్ ఎమ్మా సూతో తలపడనుంది. మరో ఐదుగురు భారత బాక్సర్లు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సౌక్షి చౌదరి(52 కేజీలు), మనీషా మౌన్(57 కేజీలు), జైస్మిన్ లంబోరియా(60 కేజీలు), లోవ్లినా బోర్డోహైన్(75 కేజీలు) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఆడనున్నారు.