
హైదరాబాద్: ప్రతిష్టాత్మక మహిళల వరల్డ్ చాంపియన్షిప్లో బంగారు పతకం గెలిచిన భారత బాక్సర్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ను టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుశ్క శర్మ అభినందించారు. గురువారం 52కేజీ ఫ్లయ్వెయిట్ విభాగంలో జరిగిన ఫైనల్లో నిఖత్ జరీన్ 5-0 తేడాతో జిట్పాంగ్ జుటామస్ (థాయ్లాండ్)ను చిత్తుగా ఓడించి విజేతగా నిలిచింది.
రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా టోర్నీలో వరల్డ్ చాంపియన్గా నిలిచిన ఐదో భారత బాక్సర్గా నిఖత్ నిలిచింది. గతంలో మేరీ కోమ్, సరితాదేవి, ఆర్ఎల్ జెన్నీ, కేసీ లేఖ ఈ ఫీట్ సాధించారు. అయితే చివరిసారిగా 2018లో మేరీకోమ్ (48కేజీ) భారత్కు వరల్డ్ చాంపియన్షిప్ సాధించగా.. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ బాక్సర్ దేశానికి స్వర్ణం అందించడం విశేషం. నిఖత్ సాధించిన ఈ విజయం పట్ల యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నిఖత్కు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపిన విరుష్క.. ఇదే టోర్నీలో కాంస్య పతకాలు సాధించిన బాక్సర్లు పర్వీన్, మనీషాలను కూడా ప్రశంసించారు.
'నిఖత్ జరీన్.. నీ విజయంతో యావత్ దేశం గర్విస్తోంది. మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన నీకు, కాంస్యపతకాలు సాధించిన మనీషా మౌన్, ప్రవీణ్లకు నా అభినందనలు'అని విరాట్ ట్వీట్ చేశాడు. ఇక అనుష్క శర్మ తన ఇన్స్టా స్టోరీలో అభినందనలు తెలిపింది. 'కంగ్రాట్స్ నిఖత్ జరీన్.. దేశం గర్వించే విజయాన్నందుకున్నావ్'అని పేర్కొంది. ప్రస్తుతం మేరీకోమ్ కూడా 52 కేజీల విభాగంలో పోటీపడుతుండగా.. కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధతో ఉన్న ఆమె ఈ టోర్నీకి దూరంగా ఉండిపోయింది.