అన్యాయం జరిగిందా?
రౌండ్ ఆఫ్ 16లో తాను గెలిచానని భావించి సంబరాలు చేసుకున్న దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్.. ఆ తర్వాత ఓడిన విషయం తెలుసుకొని జడ్జీల నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే తాజాగా మేరీ కోమ్.తన రింగ్ డ్రెస్పై లేవనెత్తిన సందేహాలు చూస్తుంటే.. ఆమెకు అన్యాయం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు రౌండ్ ఆఫ్ 16 బౌట్కు నిమిషం ముందు మాత్రమే తన రింగ్ డ్రెస్ మార్చుకోవాలని చెప్పారని, ఎవరైనా దీనికి సమాధానం చెబుతారా అంటూ మేరీ కోమ్ శుక్రవారం ట్వీట్ చేసింది.
రింగ్ డ్రెస్ అంటే ఏంటో
'ఆశ్చర్యంగా ఉంది. రింగ్ డ్రెస్ అంటే ఏంటో ఎవరైనా వివరించగలరా?. రౌండ్ ఆఫ్ 16 బౌట్కు నిమిషం ముందు నాకు రింగ్ డ్రెస్ మార్చుకోమని చెప్పారు' అని ట్విటర్లో మేరీ కోమ్ ట్వీట్ చేసింది. PMOIndia, ianuragthakur, KirenRijiju, iocmedia, Olympics అనే హాష్ ట్యాగ్లను జతచేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గురువారం జరిగిన బౌట్లో తాను ఓడిపోయిన విషయం.. ఇండియా మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ కిరన్ రిజిజు చేసిన ట్వీట్తోనే తెలిసిందని మేరీ చెప్పడం విశేషం.
తాను గెలిచాననే భావించానని, డోపింగ్ సెంటర్కు శాంపిల్ ఇవ్వడానికి వెళ్లిన సమయంలోనూ తాను అదే ఫీలింగ్తో ఉన్నానని చెప్పింది. తాను గతంలో కొలంబియన్ను ఓడించానని, ఆమెకు అనుకూలంగా నిర్ణయం వచ్చిందని కూడా పేర్కొంది. అయితే తనకు జరిగిన అన్యాయంపై మేరీ అప్పీల్ చేసే అవకాశం కూడా ఈ ఒలింపిక్స్లో లేదు.
Tokyo Olympics 2021: ట్రాక్ అండ్ ఫీల్డ్లోనూ నిరాశే.. 7వ స్థానానికి పరిమితమైన ద్యుతీ చంద్!!
|
46 పాయింట్లు మాత్రమే
48-51 కిలోల విభాగంలో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో మేరీ కోమ్ 27-30, 28-29, 30-27, 28-29, 29-28 తేడాతో ఓటమి పాలైంది. మేరీ కోమ్, లోరెనా వాలెన్సియా మధ్య జరిగిన పోరు హోరాహోరీగా సాగింది. తనదైన శైలిలో ఎదురుదాడికి దిగిన వాలెన్సియా తొలి రౌండ్లో న్యాయ నిర్ణేతలను మెప్పించింది. ఐదుగురు జడ్జీలు ఆమెకు 49 పాయింట్లు ఇవ్వగా.. మేరీ కోమ్కు 46 మాత్రమే కేటాయించారు.
ఆ తర్వాతి రెండు రౌండ్లలో భారత బాక్సర్ మేరీ విజృంభించింది. తన అనుభవాన్ని ఉపయోగించి పంచ్లు విసిరింది. వాలెన్సియా సైతం అదే రీతిలో చెలరేగడంతో న్యాయనిర్ణేతలు ఇద్దరికీ సమానంగా స్కోర్ ఇచ్చారు. తొలి రౌండ్లో ఆధిక్యంతో వాలెన్సియా క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది.
ఇవే చివరి ఒలింపిక్స్
ఈ ఓటమితో టోక్యో ఒలింపిక్స్ 2021 నుంచి మేరీ కోమ్ నిష్క్రమించింది. ఓటమి బాధ తట్టుకోలేక ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీ కన్నీటి పర్యంతం అయింది. 38 ఏళ్ల మేరీకి ఇవే ఆఖరి ఒలింపిక్స్ అని వార్తలు వస్తున్నాయి. మరోసారి ఒలింపిక్స్ ఆడాలంటే.. ఆమె మరో మూడేళ్లు వేచిచూడాల్సి ఉంది. అప్పటివరకు కొనసాగుతారో లేదో చూడాలి. అయితే తాను ఫిట్గా ఉన్నంతకాలం ఆటలో కొనసాగుతానని ఆమె స్పేటం చేసింది.