టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో అథ్లెటిక్స్ ప్రారంభమైన తొలి రోజే భారత అథ్లెట్లు పూర్తిగా నిరాశపరిచారు. మెన్స్ 3000 మీటర్ల స్టీపుల్ చేజ్, మెన్స్ 400 మీటర్ల హర్డిల్స్, వుమెన్స్ 100 మీటర్ల రేసుల్లో భారత అథ్లెట్లు ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయారు. స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్, అవినాష్ ముకుంద్, మాదారి జబీర్ తమతమ రేసుల్లో విఫలమయ్యారు. దీంతో ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్ పతక ఆశలు గల్లంతయ్యాయి.
ఇదేందయ్యో ఇది.. నేనెప్పుడూ చూడలే! మ్యాచ్కు ముందు అథ్లెట్ చెంపలు వాయించిన కోచ్ (వీడియో)
టోక్యో ఒలింపిక్స్ 2021లో కచ్చితంగా పతకం తీసుకొస్తుందని అందరూ అంచనాలు పెట్టుకున్న స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ నిరాశ పరిచింది. 100 మీటర్ల రేసులో ఆమె విఫలమైంది. హీట్ 5లో పాల్గొన్న ద్యుతీ చంద్ 11.54 సెకన్లలో రేసు పూర్తి చేసి.. 7వ స్థానానికి పరిమితమైంది. ప్రతి హీట్లో టాప్-3 ఉన్న వారు మాత్రమే అర్హత సాధిస్తారు. ఈ హీట్లో ప్రపంచ సెకండ్ ఫాస్టెస్ట్ వుమన్, జమైకా స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ 10.84 సెకన్లలో రేసు పూర్తి చేసి టాప్లో నిలిచింది.
ఇక 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో భారత అథ్లెట్ అవినాష్ ముకుంద్ నేషనల్ రికార్డు నమోదు చేసినా.. ఫైనల్కు మాత్రం క్వాలిఫై కాలేకపోయాడు. హీట్ 2లో పాల్గొన్న అవినాష్.. 8:18.12 నిమిషాలలో రేసు పూర్తి ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక 400 మీటర్ల హర్డిల్స్లో మాదారి జబీర్ మరి దారుణంగా విఫలమయ్యాడు. హీట్ 5లో పాల్గొన్న జబీర్.. ఏకంగా చివరి స్థానంలో నిలిచాడు. ఈ రేసును అతడు 50.77 సెకన్లలో పూర్తి చేశాడు.
అంతకుముందు భారత షూటర్లు మను బాకర్, రాహి సర్నోబత్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో తీవ్రంగా నిరాశపరిచారు. క్వాలిఫికేషన్ ప్రిసిషన్ రౌండ్లో 292 స్కోరుతో 5వ స్థానంలో నిలిచి ఆశలు రేపిన మను.. ర్యాపిడ్ రౌండ్లో వెనుకబడి పోయింది. మూడు సిరీస్లు కలిపి (96, 97, 97) 290 స్కోరు మాత్రమే చేయగలిగింది. దీంతో మను మొత్తం స్కోరు 582కు పరిమితమైంది. రెండు క్వాలిఫికేషన్ రౌండ్లు (ప్రిసిషన్, ర్యాపిడ్) కలిపి 11వ స్థానంలో ఉంది. ఫైనల్కు టాప్ 8 మాత్రమే క్వాలిఫై అవుతారు. ప్రిసిషన్ రౌండ్లోనే తీవ్రంగా నిరాశ పరిచిన రాహి సర్నోబత్ మొత్తం 573 స్కోరుతో 32వ స్థానంలో నిలిచింది.