స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ సంచలనం, భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఫైనల్కు దూసుకెళ్లింది. తిరుగులేని పంచ్ పవర్తో దూకుడు కనబరుస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసింది. శనివారం జరిగిన మహిళల 50 కేజీల సెమీస్ పోరులో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ 5-0 తేడాతో జ్లాటిస్లావా చుకనోవాను ఓడించింది.
తొలి రౌండ్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా నిఖత్ బలంగా నిలబడింది. తనదైన శైలిలో పంచ్లు కురిపించి 3-2తో ఆ రౌండ్ ముగించింది. ఇక రెండో రౌండ్ నుంచి నిఖత్కు ఎదురే లేకుండా పోయింది. ప్రత్యర్థిపై ముష్టి ఘాతాలతో ఆమె రెచ్చిపోయింది. 5-0, 5-0తో చివరి రెండు రౌండ్లను సొంతం చేసుకుంది. ఓవరాల్గా 5-0తో నిఖత్ పై చేయి సాధించింది.

ఆదివారం జరిగే ఫైనల్లో ఉజ్బెకిస్థాన్ ప్లేయర్ సబీనతో నిఖత్ అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు పురుషుల 51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ 5-0తో గుమస్ సమెత(టర్కీ)పై గెలిచి ఫైనల్ చేరాడు. అరుంధతి చౌదరి(66 కేజీలు), బరుణ్ సింగ్(48 కేజీలు), సచిన్(57 కేజీలు), రజత్(67 కేజీలు) కూడా ఫైనల్కు అర్హత సాధించారు.
గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో నిఖత్ జరీన్ బ్రాంజ్మెడల్తో సరిపెట్టింది. సెమీఫైనల్లో థాయ్లాండ్ బాక్సర్ రక్సత్ చుథామట్ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను ఖరారు చేసుకున్న నిఖత్.. దేశానికి స్వర్ణ పతకం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తోంది.