
హైదరాబాద్: అంతర్జాతీయ క్రీడల్లో తమ ప్రతిభతో మువ్వన్నెల జెండాను రెపరెపలాండించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్,షూటర్ ఇషా సింగ్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ. 2 కోట్ల క్యాష్ రివార్డుతో పాటు ఇంటిస్థలం కూడా కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించనుంది.
మహిళల ప్రపంచకప్ బాక్సింగ్ చాంపియన్షిప్లో నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా టోర్నీలో వరల్డ్ చాంపియన్గా నిలిచిన ఐదో భారత బాక్సర్గా నిఖత్ నిలిచింది. గతంలో మేరీ కోమ్, సరితాదేవి, ఆర్ఎల్ జెన్నీ, కేసీ లేఖ ఈ ఫీట్ సాధించారు. అయితే చివరిసారిగా 2018లో మేరీకోమ్ (48కేజీ) భారత్కు వరల్డ్ చాంపియన్షిప్ సాధించగా.. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ బాక్సర్ దేశానికి స్వర్ణం అందించడం విశేషం.
ఇక బాక్సింగ్ రింగ్ కూడా లేని నిజామాబాద్ పట్ణణం నుంచి భారత స్టార్ బాక్సర్గా నిఖత్ జరీన్ ఎదిగిన తీరు ప్రశంసనీయం. పదేళ్ల వయసులో వేసవి సెలవుల్లో తండ్రితో కలిసి సరదాగా ఫిట్నెస్ కోసం మైదానం బాట పట్టిన నిఖత్ తొలుత అథ్లెటిక్స్లో ప్రవేశించి ఆ తర్వాత బాక్సింగ్ను కెరీర్గా మలుచుకుంది. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్కప్ షూటింగ్ పోటీల్లో ఈషా సింగ్ గోల్డ్ మెడల్ సాధించింది.