Sakshi Malik: భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా తాము చేసిన పోరాటం వృథా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది.
తాజాగా జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ప్రధాన అనుచరుడు అయిన సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. మహిళా రెజ్లర్ల నిరసనకు అండగా నిలిచిన మాజీ రెజ్లర్ అనితా షెరాన్పై ఆయన విజయం సాధించాడు. దాంతో సాక్షి మాలిక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

40 రోజుల పాటు రోడ్లపై తాము చేసిన ఆందోళన అంతా వృథా అయిందని పేర్కొంది. 'దాదాపు నలభై రోజుల పాటు నిరసన చేస్తూ రోడ్లపై నిద్రించాం. దేశవ్యాప్తంగా మాకు ఎంతో మద్దతు లభించింది. ఒకవేళ బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి అతని అనుచరడు డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు అయితే తాను రెజ్లింగ్ను వదిలిస్తా'అని ప్రకటించింది. ఫలితాలు వెలువడిన వెంటనే ఈ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ రెజ్లింగ్కు గుడ్బై చెప్పింది.
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ తదితర రెజ్లర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దాంతో డబ్ల్యూఎఫ్ఐ పాలక వర్గాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రయత్నించగా కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది.
ఈ ఎన్నికలపై పంజాబ్, హరియాణా హైకోర్టు విధించిన స్టేను ఇటీవల సుప్రీం కోర్టు ఎత్తి వేసింది. దాంతో ఈ రోజు ఎన్నికలు జరపగా.. సంజయ్ సింగ్ విజయం సాధించారు. ఆయన ఉత్తర ప్రదేశ్ రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా, డబ్ల్యూఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా పని చేశారు.
సాక్షితో పాటు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, ఈ ఫలితాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వినేశ్ ఫొగాట్ కన్నిటీ పర్యంతమవ్వగా.. బజరంగ్ పునియా ప్రభుత్వం తమ మాటను నిలబెట్టుకోలేకపోయిందన్నాడు.