పారిస్ ఒలింపిక్స్ 2024 నేపథ్యంలో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు అథ్లెట్ల సహాయక సిబ్బంది ఒలింపిక్స్ విలేజ్ బయట మూడు పూటల తిండి కోసం నానా కష్టాలు పడుతుంటే.. మరోవైపు బీఎఫ్ఐ తమ అనుబంధ రాష్ట్ర సంఘాల నేతలకు, అధికారులకు రాజభోగాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
దేశవ్యాప్తంగా బీఎఫ్ఐకి అనుబంధంగా ఉన్న అసోసియేషన్ల నుంచి దాదాపు 25 మంది అధికారుల( అధ్యక్షులు, సెక్రటరీలు)ను ఒలింపిక్స్ అబ్జర్వర్లుగా పారిస్ పంపించింది. అక్కడ వారికి రాచమర్యాదాలు చేస్తోంది. వచ్చే ఏడాది బీఎఫ్ఐ అధ్యక్ష ఎన్నికలు ఉండటంతోనే రాష్ట్ర సంఘాల అసోసియేషన్ ప్రతినిధులను పారిస్ ట్రిప్కు పంపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల కోసం దుబార ఖర్చు..
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే భారీ సంఖ్యలో అబ్జర్వర్లను పంపించి వారికి రాజభోగాల కోసం ఖర్చు చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అసోసియేషన్ల బలోపేతానికి, స్థానిక బాక్సర్ల ఎదుగుదలకు వినియోగించాల్సిన డబ్బులను డబ్ల్యూఎఫ్ఐ ఇలా స్వార్థ ప్రయోజనాల కోసం దుబారా చేస్తోందని ఓ మాజీ బాక్సింగ్ కోచ్ మీడియాకు తెలిపారు.
ఇది అత్యంత దారుణమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోనంత వరకు ఈ పరిస్థితి ఇలానే కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సహాయక సిబ్బందికి కష్టాలు..
భారత బాక్సింగ్ జట్టుతో పారిస్ ఒలింపిక్స్ వెళ్లిన సహాయక సిబ్బంది అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఆహారం, వసతులు లేక నానా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఒలింపిక్స్ బయట ఉండే సపోర్ట్ స్టాఫ్కు డెయిలీ అలవెన్స్గా రోజుకు 100 అమెరికా డాలర్లుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అయితే ఈ డబ్బులు ఏ మాత్రం సరిపోవని భారత బాక్సింగ్ జట్టు అధికారి ఒకరు మీడియాతో అన్నారు.
కిరాణా షాపుల్లో సరుకులు తెచ్చుకొని స్వయంగా వండుకొని తింటున్నామని చెప్పారు. క్రీడా మంత్రిత్వశాఖ ఆమోదించిన ఓ ప్రైవేట్ ఎజెన్సీ బుక్ చేసిన హోటల్లో అల్పాహారం మాత్రమే పెడుతున్నారని, లంచ్, డిన్నర్కు మాత్రం తామే ఏర్పాట్లు చేసుకుంటున్నామని తెలిపారు. డబ్బులు సరిపోక మ్యాగీలతో కాలం వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరుగురు బాక్సర్లతో..
నలుగురు మహిళా బాక్సర్లతో మొత్తం ఆరుగురు సభ్యులతో భారత బాక్సింగ్ టీమ్ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచింది. ఈ ఆరుగురిలో తొలి రోజే అమిత్ పంఘల్(పురుషుల 51 కేజీలు), జైస్మిల్ లంబోరియా(మహిళల 57 కేజీలు) ఇద్దరూ ఓటమిపాలై స్వదేశానికి పయనమయ్యారు.
క్రీడా మంత్రిత్వశాఖ అనుమతిచ్చిన అధికార జాబితా ప్రకారం ముగ్గురు కోచ్లు, ఒక ఫిజియో ఒలింపిక్ విలేజ్లో నివసిస్తున్నారు. ఇద్దరు కోచ్లు, వైద్యుడు, స్ట్రెంగ్త్ అండ్ కండిషన్ ఎక్స్పర్ట్, ఫిజియో, ఇద్దరూ టీమ్ అధికారులు మొత్తం ఏడుగురు ఒలింపిక్స్ విలేజ్ బయట బస చేస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచే అథ్లెట్లు, అధికారులు, సహాయక సిబ్బంది ఖర్చులను భరిస్తోంది.