తాష్కెంట్: పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ ఆటగాడు మహమ్మద్ హుస్సాముద్దీన్ సత్తా చాటాడు. తన పంచ్ పవర్ చూపిస్తూ.. మెగా టోర్నీలో వరుస విజయాలతో సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. నాకౌట్ మ్యాచ్లో ఓడినా హుస్సాముద్దీన్కు బ్రాంజ్ మెడల్ దక్కనుంది.
బుధవారం జరిగిన 57 కేజీల క్వార్టర్స్ ఫైనల్లో హుస్సాముద్దీన్ 4-3తో ఐదో సీడ్, బల్లేరియా బాక్సర్ దియాజ్ ఇబనేజ్పై ఉత్కంఠ విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన పోరులో తొలి రౌండ్లో తెలంగాణ స్టార్ 3-2తో పై చేయి సాధించాడు. రెండో రౌండ్ నుంచి మరింత ఆత్మవిశ్వాసంతో ఆడి ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపెట్టాడు.

ఇబనేజ్పై బలమైన పంచ్లతో విరుచుకుపడ్డాడు. సెమీస్లో హుస్సాముద్దీన్ క్యూబాకు చెందిన సైడెల్ హోర్టాతో పోటీ పడతాడు. హుస్సాముద్దీన్తో పాటు భారత బాక్సర్లు దీపక్ బోరియా, నిశాంత్ దేవ్ కూడా సెమీస్ చేరి కనీసం బ్రాంజ్ మెడల్ ఖాయం చేసుకున్నారు. దాంతో ఈ టోర్నీ చరిత్రలో భారత్కు అత్యధికంగా మూడు పతకాలు ఖాయం అయ్యాయి.
2019లో సిల్వర్, బ్రాంజ్ మెడల్ రావడమే ఇప్పటి వరకు బెస్ట్ పెర్ఫామెన్స్. బుధవారమే జరిగిన 71 కేజీల బౌట్లో నిశాంత్ 5-0తో క్యూబాకు చెందిన జార్జ్ క్యుయెలర్ను నాకౌట్ చేశాడు. సెమీస్లో అతను ఆసియా చాంపియన్ అస్లన్బెక్(కజకిస్తాన్)తో పోటీ పడనున్నాడు. 51 కేజీల కేటగిరిలో దీపక్ బోరియా 5-0తో చైనాకు చెందిన జాంగ్ జియామోను నాకౌట్ చేశాడు.
సెమీస్లో దీపక్.. ఫ్రాన్స్కు చెందిన బెన్నమాతో తలపడనున్నాడు. శుక్రవారం సెమీఫైనల్ పోటీలు జరగనున్నాయి. క్వార్టర్ ఫైనల్లో సచిన్ సివాచ్(54 కేజీలు), ఆకాశ్ సంగ్వాన్(0-5) ఓటమిపాలయ్యారు.