భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ కన్నీటి పర్యంతమైంది. తన మాజీ భర్త కరుంగ్ ఓన్లర్ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని, తన డబ్బులతో జల్సాలు చేశాడని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. క్లారిటీ ఇచ్చింది. తాను ఎవర్నీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఏళ్ల తరబడి అణచిపెట్టుకున్న బాధ అని స్పష్టం చేసింది.
ఓ టాక్ షోలో తన మాజీ భర్తను ఉద్దేశించి మేరీ కోమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేపాయి. ఓన్లర్కు ఒక్క రూపాయి కూడా సంపాదించడం చేత కాదని, తన బాక్సింగ్ డబ్బులతో విలావసవంతంగా బతికారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఓన్లర్ ఫుట్బాల్ కెరీర్ను కూడా తక్కువ చేసి మాట్లాడింది. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యలు పురుష సమాజాన్ని కించపర్చేలా ఉన్నాయని నెటిజన్లు మండిపడ్డారు.

దాంతో మేరీ కోమ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చింది. తన వ్యాఖ్యలు ఏళ్ల తరబడి అణచిపెట్టుకున్న భావోద్వేగాల ఫలితమేనని తెలిపింది. 'నా వ్యాఖ్యలు ఏళ్ల తరబడి అణచిపెట్టుకున్న బాధలో నుంచి వచ్చినవి. వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న మోసం, డిప్రెషన్, నమ్మకద్రోహం వల్ల ఆ సమయంలో ఆవేశంగా మాట్లాడాను. నా వ్యాఖ్యలు పురుష సమాజాన్ని ఉద్దేశించినవి కావు. ఎవర్నీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యలు ఎవరి మనసులనైనా నొప్పించి ఉంటే క్షమించండి.
ఫుట్బాల్ ఆటను నేను ఎంతో గౌరవిస్తాను. సునీల్ ఛెత్రి, బైచుంగ్ భూటియా వంటి ఆటగాళ్లను నేను ఎంతో ఆరాధిస్తాను. నా మాజీ భర్త నా కోసం కెరీర్ త్యాగం చేశాననడంలో వాస్తవం లేదు. నన్ను కలవక ముందే ఆయన ఆటను వదిలేసారు. గతేడాది విడాకులు తీసుకున్న తర్వాత నాపై అనేక తప్పుడు వార్తలు వచ్చినప్పటికీ, నేను ఎంతో గౌరవంగా, మౌనంగా ఉన్నాను.'అని మేరీ కోమ్ చెప్పుకొచ్చింది.
టాక్ షోలో తనపై మేరీ కోమ్ చేసిన ఆరోపణలకు ఆమె మాజీ భర్త ఓన్లర్ కూడా కౌంటరిచ్చాడు. మేరీ కోమ్కు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ కారణంగానే తమ 18 ఏళ్ల బంధం విడిపోయిందని ఆరోపించాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్స్, ఆధారాలు ఉన్నాయని చెప్పాడు. పిల్లల భవిష్యత్తు కోసం తాను ఎంతో త్యాగం చేశానని, మేరీ కోమ్ తనను ఆర్థిక మోసగాడిగా చిత్రీకరించడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.