పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్కు తీవ్ర అన్యాయం జరిగింది. క్వార్టర్ ఫైనల్ చేరి పతక ఆశలను రెట్టింపు చేసిన నిశాంత్ దేవ్ అనూహ్య రీతిలో పరాజయం పాలయ్యాడు. జడ్జీల ఛీటింగ్ కారణంగా సెమీఫైనల్కు అర్హత సాధించలేకపోయాడు. 71 కేజీల విభాగంలో పోటీ పడిన నిశాంత్ దేవ్.. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాడు.
మెక్సికో బాక్సర్ మార్కో వెర్డే 4-1 తేడాతో నిశాంత్ దేవ్ను ఓడించాడు. ఈ మ్యాచ్ తొలి రౌండ్లో ఆధిక్యం ప్రదర్శించిన నిశాంత్ దేవ్.. వరుసగా రెండు రౌండ్లలో మెరుగైన ప్రదర్శన కనబర్చినా.. జడ్జీలు ప్రత్యర్థి బాక్సర్కు అనుకూలమైన తీర్పు ఇచ్చారు. అతన్నే విజేతగా ప్రకటించారు. దాంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిశాంత్కు మద్దతుగా భారత మాజీ ఛాంపియన్ విజేందర్ సింగ్, బాలీవుడ్ హీరో రణ్దీప్ సింగ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెట్టారు. 'అసలు ఈ మ్యాచ్ స్కోరింగ్ సిస్టమ్ ఎలా ఉందో అర్థం కావడం లేదు. ఇది గొప్ప ఫైట్. నిశాంత్ దేవ్ చాలా అద్భుతంగా ఆడాడు. బాధపడొద్దు నిశాంత్'అని విజేందర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.
బాలీవుడ్ స్టార్ రణ్దీప్ హుడా కూడా ఒలింపిక్స్ కమిటీపై కాస్త ఘాటుగానే స్పందించాడు. 'ఈ పోటీలో నిశాంత్దే గెలుపు. స్కోరింగ్ విధానం సరైందేనా? నీ నుంచి పతకాన్ని దోచేశారు. కానీ, నువ్వు మా మనసులను గెలిచావు. అత్యంత బాధాకరం. ఇలాంటివి చాలా జరిగాయి.'అని రణ్దీప్ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్లో తనదే విజయమని నిశాంత్ భావించాడు. కానీ జడ్జీలు ప్రత్యర్థిని విజేతగా ప్రకటించడంతో ఖంగుతిన్నాడు. మొదటి రౌండ్లో వెర్డెపై నిశాంత్ ఎదురుదాడికి దిగాడు. రెండో రౌండ్లోనూ నిశాంత్ ఆధిపత్యం ప్రదర్శించినా.. జడ్జీలు మాత్రం 3-2తో వెర్డేదే పై చేయి అని చెప్పాడు.
మూడో రౌండ్లోనూ ఐదుగురు జడ్జీలు పదేసి పాయింట్లు వెర్డెకు ఇవ్వగా.. నిశాంత్కు తొమ్మిది చొప్పున ఇవ్వడంతో ఓటమిపాలయ్యాడు. ఈ మ్యాచ్లో విజయం సాధించి ఉంటే నిశాంత్ దేవ్కు కనీసం కాంస్య పతకం ఖాయమయ్యేది.