
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన స్టార్ బాక్సర్ సిమ్రన్జిత్ కౌర్ పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రీడాకారుల కన్నా టిక్టాకర్లే ముఖ్యామా? అని ప్రశ్నించింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న తనకు సీఎం అమరీందర్ సింగ్ ఐదు నెలల క్రితం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని తెలిపింది. టిక్టాక్ స్టార్లకు సమయానికి డబ్బు ఇచ్చిన ప్రభుత్వం.. తనకు ఇచ్చిన మాటను మాత్రం నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఒలింపిక్స్కు జనవరిలో సిమ్రన్ అర్హత సాధించగా.. ఆమె ఆర్థిక పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న సీఎం.. అన్ని విధాలా సాయం అందించాలని అధికారులను ట్విట్టర్ వేదికగా ఆదేశించారు. అప్పుడు భారత వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్తో పాటు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాను అభినందించారు. ఓ క్రీడాకారిణి దీన స్థితిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆమెకు మేలు చేశారని మెచ్చుకున్నారు.
అయితే ఐదు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని మంగళవారం ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిమ్రన్జిత్ ఆవేదన వ్యక్తం చేసింది. 'పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నదో నాకు తెలియదు. నాకు రూ.5 లక్షల సాయం చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. టిక్టాక్ స్టార్లకు మాత్రం ప్రభుత్వం సమయానికి డబ్బులు ఇచ్చింది. మార్చిలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎవరు పట్టించుకోలేదు. నాకు ఇంతవరకు ఎలాంటి రాతపూర్వక హామీ లభించలేదు. ఒక్క పత్రం కూడా అందలేదు. అసలు నా బాధను ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడంలేదు. లాక్డౌన్ వల్ల అంతా స్తంభించిపోయింది. నాకు ఉద్యోగం అత్యవసరం. దయచేసిన నా పరిస్థితిని అర్థం చేసుకోండి.' అని సిమ్రన్జిత్ కౌర్ చెప్పింది.
ప్రస్తుతం పటియాల నేషనల్ క్యాంప్లో ఉన్న 24 ఏళ్ల సిమ్రన్ జిత్.. టోక్యో ఒలింపిక్స్లో మెడలే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. రెండేళ్ల కిత్రం ఢిల్లీ వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్షిప్ పోటీల్లో 64 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన సిమ్రన్.. గతేడాది జరిగిన ట్రయల్స్లో సరితా దేవి చేతిలో ఓడింది. అతనంతరం తన గేమ్ను మెరుగుపరుచుకొని ఆసియా క్వాలిఫైయింగ్ ఈవెంట్లో రజతం గెలిచి ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకుంది..