భారత మాజీ బాక్సర్ స్వీటీ బూర తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. అడిగినంత ఇచ్చినా.. అదనపు కట్నం కోసం తన భర్త, అత్తింటివారు వేధిస్తున్నారని, భౌతిక దాడికి పాల్పడుతూ హింసిస్తున్నారని ప్రపంచ మాజీ ఛాంపియన్, అర్జున అవార్డ్ గ్రహీత అయిన స్వీటీ బూర పోలీసులను ఆశ్రయించారు. దాంతో ఆమె భర్త దీపక్ హుడా, అతని కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హరియాణాకు చెందిన కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాతో 2022లో తనకు వివాహమైందని తెలిపిన స్వీటీ బూర.. పెళ్లి సమయంలో తన పుట్టింటి వారు రూ. కోటి కట్నంతో పాటు ఫార్చునర్ కారు బహుమతిగా ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంకా కట్నం తీసుకురావాలని తనపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దీపక్ హుడాకు నోటీసులు జారీ చేశారు. అనారోగ్య కారణాలతో అతను విచారణకు హాజరు కాలేదు. దాంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు భర్త నుంచి విడాకులు కోరుతూ స్వీటీ బూర ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రొఫెషనల్ బాక్సర్ అయిన స్వీటీ.. 2023లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది. గతేడాది ఫిబ్రవరిలో భర్తతో కలిసి బీజేపీలో చేరిన స్వీటీ బూర.. గత నెలలోనే రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున్ అవార్డ్ అందుకుంది. ఇక, 2016లో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్, 2014 ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ సాధించిన భారత కబడ్డీ జట్టులో దీపక్ హుడా సభ్యుడిగా ఉన్నాడు. అతను ప్రొ కబడ్డీ లీగ్లోనూ ఆడాడు. గతేడాది జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. దీపక్ హుడాకు కూడా అర్జున అవార్డ్ దక్కింది.