హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో స్వర్ణమే లక్ష్యంగా బరిలో దిగిన భారత స్టార్ బాక్సర్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఒకే పంచ్తో రెండు విజయాలు సాధించింది.
అదే దూకుడు కొనసాగిస్తూ ఈ తెలంగాణ అమ్మాయి సెమీఫైనల్కు దూసుకెళ్లి మెడల్ ఖాయం చేసింది. శుక్రవారం జరిగిన 50 కేజీల క్వార్టర్ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్.. నాసర్ హనన్ (జోర్డాన్)ను చిత్తు చేసింది. బౌట్ ఆరంభం నుంచి ఎటాకింగ్ గేమ్ ఆడిన జరీన్.. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. చక్కని ఫుట్వర్క్, లెఫ్ట్, రైట్ హుక్ల మేళవింపుతో విరుచుకుపడి కేవలం మూడు నిమిషాల్లోనే హనన్ను మట్టికరిపించింది.

హనన్ ఆటను కొనసాగించలేకపోవడంతో రిఫరీ బౌట్ను ఆపేసి నిఖత్ను విజేతగా ప్రకటించాడు. సెమీస్ చేరడం ద్వారా భారత స్టార్ కనీసం బ్రాంజ్ మెడల్ ఖాయం చేసుకుంది. ఈ విజయంతో 2024 పారిస్ ఒలింపిక్ కోటా బెర్తును కూడా దక్కించుకుంది.
మహిళల బాక్సింగ్ 50, 54, 57, 60 కేజీల విభాగంలో సెమీస్ చేరిన బాక్సర్లు నేరుగా ఒలింపిక్స్కు అర్హత సాధిస్తారు. మరోవైపు పర్వీన్ (57 కేజీ) 5-0తో జిచున్ (చైనా)ను చిత్తు చేసి క్వార్టర్స్ చేరింది.

శుక్రవారం భారత అథ్లెట్లు రెండు గోల్డ్ మెడల్స్తో సహా మొత్తం 8 పతకాలు ఖాతాలో వేసుకున్నారు. షూటింగ్ విభాగంలోనే ఐదు మెడల్స్ దక్కాయి. భారత్ పతకాల సంఖ్య 33కు చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యలున్నాయి. పతకాల పట్టికలో 200 మెడల్స్తో చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 99 పతకాలతో జపాన్, 102 మెడల్స్ కొరియా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 33 మెడల్స్ భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.