
దుబాయ్: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లోడిఫెండింగ్ చాంపియన్ అమిత్ పంఘాల్ (52 కేజీలు), మాజీ విజేత శివ థాపా (64 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో టాప్ సిడ్ అమిత్ 5-0తో వరల్డ్ చాంపియన్షిప్ బ్రాంజ్ మెడలిస్ట్, కజకిస్తాన్ స్టార్ బాక్సర్ బిబోసినోవ్ పై గెలుపొందాడు. సూపర్ ఫామ్లో ఉన్న వరల్డ్ నంబర్ వన్ ఇండియా బాక్సర్ బౌట్లో పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. పదునైన కౌంటర్ అటాక్స్తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. అమిత్ తన చాన్స్ వచ్చే వరకు ఓపిగ్గా వేచి చూడగా.. స్టార్టింగ్ నుంచే దూకుడగా ఆడిన బిబోసినోవ్ బౌట్ సాగుతున్న కొద్దీ డీలా పడ్డాడు. ఫైనల్ రౌండ్లో పంగల్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు.
మరోవైపు 64 కేజీ కేటగిరీ సెమీఫైనల్లో శివ థాపా 4-0తో తజకిస్తాన్ టాప్ సిడ్ బఖోదుర్ ఉస్మనోవ్ పై ఘనవిజయం సాధించాడు. అమిత్ 2019లో స్వర్ణం నెగ్గగా... శివ థాపా 2013లో పసిడి పతకం సాధించి, ఆ తర్వాత 2017లో రజతం... 2015, 2019లో కాంస్యాలు గెలిచాడు.
మరోవైపు భారత్కే చెందిన వరీందర్ (60 కేజీలు), వికాస్ కృషన్ (69 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. వరీందర్ 2-3తో షాబ (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. బతురోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన బౌట్లో వికాస్ కంటి గాయం తిరగబెట్టడంతో రిఫరీ బౌట్ను నిలిపివేసి బతురోవ్ను విజేతగా ప్రకటించారు. మహిళల విభాగంలో సాక్షి (54 కేజీలు)-దీనా (కజకిస్తాన్) సెమీఫైనల్ బౌట్ ఫలితాన్ని మార్చారు. గురువారం రాత్రి జరిగిన బౌట్లో సాక్షి 3-2తో దీనాను ఓడించింది. అయితే ఈ ఫలితంపై కజకిస్తాన్ బాక్సర్ సమీక్ష కోరగా... రీప్లేలు పరిశీలించిన జ్యూరీ కజకిస్తాన్ బాక్సర్ గెలిచినట్లు ప్రకటించింది. దాంతో సాక్షికి కాంస్యం ఖాయమైంది.