ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మాజీ ఛాంపియన్ ఎలీనా రిబకినా, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ సెమీఫైనల్ చేరారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో 2022 ఛాంపియన్ రిబకినా 6-3, 6-2 తేడాతో స్వితోలినా(ఉక్రెయిన్)పై విజయం సాధించింది. పదునైన సర్వీస్లతో చెలరేగిన రిబకినా అదే జోరులో ప్రత్యర్థిని మట్టికరిపించింది.
ఈ మ్యాచ్లో రిబకినా 7 ఏస్లు, 28 విన్నర్లు కొట్టింది. తొలి సెట్ మొదటి గేమ్ కోల్పోయిన రిబకినా ఆ వెంటనే పుంజుకుంది. ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసి 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్వితోలినా కూడా ప్రతిఘటించడంతో స్కోర్ సమమైంది. ఇక అక్కడి నుంచి రిబకినాకు ఎదురు లేకుండా పోయింది. రెండో సెట్లోనూ అదే జోరును కొసాగించి విజయాన్నందుకుంది.

మరో క్వార్టర్ ఫైనల్లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్, 31వ సీడ్ క్రెజికోవా 6-4, 7-6(7-4)తో 13వ సీడ్ వొస్తా పెంకో(లాత్వియా)ను ఓడించి తొలి సారి సెమీఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్లో ప్రత్యర్థి ఆటగాడు గాయంతో తప్పుకోవడంతో నొవాక్ జొకోవిచ్కు వాకోవర్ లభించింది. దాంతో జొకోవిచ్ 13వ సారి వింబుల్డన్ సెమీస్ చేరాడు. ఈ క్రమంలో అతను రోజర్ ఫెదరర్ రికార్డ్ను సమం చేశాడు.