భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమైంది. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని ఆమె వివాహమాడనుంది. డిసెంబర్ 22న సింధు- దత్తసాయి వివాహం.. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వైభవంగా జరగనుంది. అనంతరం డిసెంబర్ 24న హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
పారిస్ ఒలింపిక్స్ ముగియగానే పెళ్లి చేసుకుందామని భావించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింధు తెలిపింది. కానీ వరుస టోర్నీలో తీరిక లేకుండా ఉండటం వల్ల వివాహం ఆలస్యమైందని పేర్కొంది. తాను వివాహం చేసుకోబోయే వెంకట దత్తసాయి తనకు చిన్నప్పటి నుంచి తెలుసని సింధు చెప్పుకొచ్చింది.

మా ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్..
తమ రెండు కుటుంబాల మధ్య ఎప్పట్నుంచో పరిచయం ఉందని పేర్కొంది. గోప్యత కోసమే ఉదయ్పుర్లో పెళ్లి చేసుకుంటున్నామని స్పష్టం చేసింది. తనకు కాబోయే భర్త బ్యాడ్మింటన్ ఆడరని, కానీ తన మ్యాచ్లను చూస్తాడని చెప్పుకొచ్చింది.
'వెంకట్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అతనికి ఓ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటారు. నాకు తీరిక లేని షెడ్యూల్ ఉంటుంది. దాంతో మేం ఎక్కువగా కలుసుకోలేదు. వెంకట్ బ్యాడ్మింటన్ ఆడరు. కానీ నా మ్యాచ్లు చూస్తారు. అతనికి క్రీడలంటే ఇష్టమే. కానీ వ్యాపారం వైపు వెళ్లారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, డేటా సైన్స్లో డిగ్రీలు పొందారు. ప్రస్తుతం సొంత కంపెనీ ప్రోసిడెక్స్ టెక్నాలజీస్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు.
పెళ్లి తర్వాత కూడా బ్యాడ్మింటన్లో కొనసాగిస్తా. ఫిట్నెస్ కాపాడుకోవడంపై ఫోకస్ పెడుతాను. ఫిట్గా ఉంటే లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028లో కూడా బరిలోకి దిగుతా. గాయాలు కాకుండా మంచి ఫిట్నెస్తో ఉంటే అది కష్టమేమీ కాదు. 'అని పీవీ సింధు చెప్పుకొచ్చింది.
ఢిల్లీ క్యాపిటల్స్తో షూరూ..
సింధుకు కాబోయే భర్త సాయి వెంకట దత్తాకు ఘన వారసత్వం ఉంది. అతని తండ్రి గౌరెల్లి వెంకటేశ్వరరావు ఆదాయపు పన్ను శాఖలో మాజీ ఆఫిసర్. ప్రస్తుతం సాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న ప్రోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థను ఆయనే స్థాపించారు. సాయి తల్లి లక్ష్మి. ఆమె తండ్రా భాస్కరరావు హైకోర్ట్ జడ్జిగా రిటైర్మెంట్ అయ్యారు.
భాస్కరరావు అన్న ఉజ్జిని నారాయణరావు సీపీఐ పార్టీ తరఫున నల్గొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే. జిందాల్ సౌత్ వెస్ట్(జేఎస్డబ్ల్యూ)తో ప్రొఫెషనల్ కెరీర్ను ప్రారంభించిన సాయి.. జేఎస్డబ్ల్యూ సహ యజమానికిగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వ్యవహారాల్ని కూడా చూసుకున్నాడు.