
బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కరోనా బారిన పడింది. టోక్యో ఒలింపిక్స్కు ముందు తన రాకెట్ సత్తా చూపాలని థాయ్లాండ్ ఓపెన్ సూపర్ -1000 టోర్నీ సిద్దమైన సైనాకు ఆదిలోనే చుక్కెదురైంది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం నిర్వహించిన మూడో టెస్టులో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. అటు మరో ప్లేయర్ హెఎస్ ప్రణయ్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో ఈ ఇద్దరు టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) మీడియా విభాగం పేర్కొంది. ఈ ఇద్దరూ ఆసుపత్రిలో చేరుతారని, 10 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంటారని వెల్లడించింది.
ఇక నేటి నుంచి(మంగళవారం) థాయ్లాండ్ ఓపెన్ సూపర్-1000 షూరు కానుంది. తొలి రౌండ్లో మలేసియాకు చెందిన షట్లర్ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉండగా.. లీ జి జియా (మలేసియా)తో ప్రణయ్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్గా తేలడంతో ఈ ఇద్దరిని టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని బీడబ్ల్యూఎఫ్ కోరింది.
ఇక జనవరి 6న గ్రీన్ జోన్ క్వారంటైన్లో పాల్గొన్న మొత్తం 824 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఆటగాళ్లు, అంపైర్లు, లైన్ జడ్జీలు, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యుఎఫ్), బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్, వైద్య సిబ్బంది, టీవీ ప్రొడక్షన్ సిబ్బంది ఉన్నారు. కరోనా వైరస్తో దాదాపు 10 నెలల తర్వాత భారత షట్లర్లు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడనున్నారు. లండన్లో ప్రత్యేక శిక్షణ పొందిన 25 ఏళ్ల సింధు ఆరో సీడ్గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్కు చెందిన మియా బ్లిచ్ఫెల్డ్తో తలపడనుంది.
పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్ల్లో 14వ ర్యాంకర్ శ్రీకాంత్ భారత్కే చెందిన సౌరభ్ వర్మతో, వంగ్చరొన్ (థాయ్లాండ్)తో సాయిప్రణీత్,, జాసన్ అంథోని (కెనడా)తో కశ్యప్ ఆడతారు. డబుల్స్లో సాత్విక్ చిరాగ్, సుమీత్-మను, అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జంటలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.