బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరోసిడ్ సింధు 17-21, 16-21 తేడాతో ఒలింపిక్ ఛాంపియన్, ప్రపంచ నాలుగో సీడ్ చెన్ యు ఫీ (చైనా) చేతిలో ఓటమిపాలైంది. కేవలం 43 నిమిషాల్లో ముగిసిన ఈ పోటీలో సింధు తెలిపోయింది. వరుస గేమ్ల్లో చెనా షట్లర్కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్.. ఈ పోటీలో సింధుకు ఊపిరాడనీయకుండా వరుస క్రమంలో పాయింట్లు సాధించి మ్యాచ్ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్కు ముందు వరకు చెన్పై 6-4 ఆధిక్యం కలిగిన సింధు.. ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక చేతులెత్తేసింది. ఈ ఇద్దరు చివరిసారిగా 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో తలపడగా అప్పుడు కూడా చెన్నే విజయం వరించింది. కాగా, సింధు ఈ టోర్నీ క్వార్టర్స్లో ప్రపంచ నెంబర్ వన్ అకానె యమగూచీకి షాకిచ్చి సెమీస్కు చేరిన విషయం తెలిసిందే.
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రిఫరీ తప్పిదం కారణంగా సింధు బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో ఒలింపిక్ మెడలిస్ట్ సింధు 21-13, 19-21, 16-21 తేడాతో జపాన్ ప్లేయర్ యమగూచి చేతిలో ఓటమిపాలైంది. టోర్నీలో ఆధ్యాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన సింధు.. కీలక సెమీఫైనల్లో అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం తనకు అన్యాయం జరిగిందంటూ అంపైర్ల తీరుపై ఈ మాజీ ప్రపంచ చాంఫియన్ అసహనం వ్యక్తం చేసింది.
ఈ మ్యాచ్లో తొలి గేమ్ను 21-13తో సునాయసంగా గెలిచిన సింధు.. రెండో గేమ్లోనూ అదే జోరు కొనసాగిస్తూ 14-11తో ఆధిక్యంలో నిలిచింది. అయితే సర్వీస్ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటున్నావని, చైర్ అంపైర్ సింధుకు పెనల్టీ పాయింట్ విధిస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన సింధు.. అంపైర్తో వాగ్వాదానికి దిగింది. ప్రత్యర్థి సిద్దంగా లేకపోవడంతోనే తాను సర్వీస్ ఆలస్యంగా చేయాల్సి వచ్చిందని వివరించినా రిఫరీ పట్టించుకోలేదు. చీఫ్ రిఫరీకి కూడా ఈ విషయం చెప్పినా అతను ఏం చేయలేకపోయాడు. ఈ ఓటమికి థాయ్లాండ్ ఓపెన్లో బదులు తీర్చుకున్న సింధు.. ఫైనల్ చేరలేకపోయింది. జూన్ 7 నుంచి జకార్త వేదికగా జరగనున్న ఇండోనేషియా ఓపెన్లో తలపడనుంది.