బ్యాంకాక్: కరోనా బ్రేక్తో సుదీర్ఘ కాలం తర్వాత రాకెట్లు పట్టుకున్న భారత ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచాడు. థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో కనీసం రెండో రౌండ్ ధాటలేకపోయారు. కొందరు ఫిట్నెస్ సమస్యలతో మరికొందరూ పరాజయాలతో ఇంటిదారి పట్టారు. ఫలితంగా థాయ్లాండ్ ఓపెన్లో భారత పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. స్థానిక షట్లర్, ప్రపంచ 12వ ర్యాంకర్ బుసానన్ చేతిలో 23-21, 14-21, 16-21 తేడాతో పోరాడి ఓడింది. దాదాపు 68 నిమిషాలు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థులిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు.
చాలాకాలం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెట్టిన సైనా.. బుసానన్తో శక్తిమేరకు పోరాడింది. తొలిగేమ్ను బుసానన్ 3-0తో ఆరంభించగా సైనా పుంజుకొని 6-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో క్రాస్కోర్టు షాట్లతో చెలరేగిన ప్రత్యర్థి విరామ సమయానికి 11-9తో ముందంజ వేసింది. 11-13 వద్ద ఉండగా సైనా మళ్లీ పుంజుకొని 17-17తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత సుదీర్ఘ ర్యాలీలతో 23-21తో సైనా తొలి గేమ్ను గెలుచుకుంది. అయితే రెండు, మూడో గేముల్లో బుసానన్ అద్భుతమైన నెట్గేమ్, క్రాస్కోర్టు షాట్లతో విరుచుకుపడి విజయం సాధించింది.
మరోవైపు పురుషుల సింగిల్స్లో రెండో రౌండ్కు చేరుకున్న మాజీ ప్రపంచ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ గాయంతో పోటీ నుంచి తప్పుకున్నాడు. మలేషియా ప్లేయర్ లీ జి జియాతో అతను తలపడాల్సింది. కానీ కుడికాలి పిక్క కండరాలు పట్టేయడంతో వాకోవర్ ప్రకటించాడు. అంతకుముందు పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 19-21, 17-21 తేడాతో ఇండోనేషియా ద్వయం మహమ్మద్ అహ్సన్, హెండ్రా సెతియవన్ చేతిలో ఓటమి పాలవ్వగా.. చాంపియన్ ప్లేయర్ సింధు తొలి రౌండ్లోనే ఇంటిదారిపట్టిన సంగతి తెలిసిందే.