
బ్యాంకాక్: కరోనా కారణంగా అంతర్జాతీయ క్యాలెండర్ దెబ్బతినడంతో దాదాపు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తిరిగి పోటీ పడుతున్నారు. టోక్యో ఒలింపిక్స్కు ముందు తమ రాకెట్ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు సిద్దమవుతున్నారు. వీరితో పాటు భారత ఆటగాళ్లంతా మంగళవారం నుంచి జరిగే థాయ్లాండ్ ఓపెన్ సూపర్-1000 టోర్నమెంట్లో పాల్గొననున్నారు.
ఇందులో జపాన్, చైనా ప్లేయర్లు గైర్హాజరీ కావడంతో భారత స్టార్లు టైటిల్ గెలిచేందుకు ఇది సరైన అవకాశం. లండన్లో ప్రత్యేక శిక్షణ పొందిన 25 ఏళ్ల సింధు ఆరో సీడ్గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్కు చెందిన మియా బ్లిచ్ఫెల్డ్తో తలపడనుంది. ప్రపంచ 20వ ర్యాంకర్ సైనా తొలి రౌండ్లో కిసొనా సెల్వడురే (మలేసియా)తో పోటీ పడుతుంది.
పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్ల్లో 14 ర్యాంకర్ శ్రీకాంత్ భారత్కే చెందిన సౌరభ్ వర్మతో, వంగ్చరొన్ (థాయ్లాండ్)తో సాయిప్రణీత్, లీ జి జియా (మలేసియా)తో ప్రణయ్, జాసన్ అంథోని (కెనడా)తో కశ్యప్ ఆడతారు. పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మతో పాటు డబుల్స్ సాత్విక్ చిరాగ్, సుమీత్-మను, అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జంటలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.