తైపీ: యోనెక్స్ తైపీ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో మూడో సీడ్ ప్రణయ్ 19-21, 8-21 తేడాతో ఐదో సీడ్ లాంగ్ ఆగ్నస్(హాంకాంగ్) చేతిలో ఓటమిపాలయ్యాడు.
38 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ప్రణయ్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి గేమ్లో మాత్రమే పోటీనిచ్చిన ప్రణయ్.. రెండో గేమ్లో ప్రత్యర్థి ఆధిపత్యానికి తల వంచాడు. కనీసం పోటీ ఇవ్వకుండా ఇంటిదారిపట్టాడు. ప్రణయ్పై ఆగ్నస్కు ఇది ఆరో విజయం. ఇద్దరి ముఖా ముఖి పోరు 6-6తో సమమైంది.

అనవసర తప్పిదాలే ప్రణయ్ ఓటమికి దారి తీసాయి. ప్రత్యర్థి తిరుగేలని బేస్లైన్ గేమ్కు ప్రణయ్ వద్ద సమాధానం లేకపోయింది. ఇదే టోర్నీలో గురువారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రణయ్ 21-9, 21-17 తేడాతో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగిర్తోపై విజయం సాధించాడు.
కేవలం 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో ప్రణయ్ పూర్తి ఆధిప్యం చెలాయించాడు. తిరుగులేని బేస్లైన్ గేమ్తో ప్రత్యర్థిని ఓడించి మరీ క్వార్టర్ ఫైనల్స్కు చేరాడు. కానీ ఆగ్నస్ ముందు ఆ జోరు కొనసాగించలేకపోయాడు. దాంతో తైపీ టోర్నీ బరిలోకి నిలిచిన ఏకైక భారత ఆటగాడి పోరాటం కూడా ముగిసినట్లు అయింది.
తైపీ ఓపెన్ టోర్నీకి భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ దూరంగా ఉన్నారు. ప్రణయ్తో కలిసి పారుపల్లి కశ్యప్ ఒక్కడే బరిలోకి దిగగా అతను ప్రిక్వార్టర్స్లోనే వెనుదిరిగాడు. గురువారమే జరిగిన ఈ మ్యాచ్లో పారుపల్లి కశ్యప్ 16-21, 17-21 తేడాతో తైవాన్కు చెందిన ఎల్వై సూ చేతిలో ఓటమిపాలయ్యాడు.
ఈ ఏడాది ప్రణయ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. గత నెలలో జరిగిన మలేసియా మాస్టర్స్ 2023 టోర్నీలో సింగిల్స్ విజేతగా నిలిచిన ప్రణయ్.. ఇండోనేషియా ఓపెన్ సెమీఫైనల్లో ఓటమిపాలయ్యాడు. డెన్మార్క్కు చెందిన టాప్ సీడ్ అక్సెల్సెన్ 21-15, 21-15 తేడాతో ఏడో సీడ్ ప్రణయ్ను మట్టికరిపించాడు.