న్యూఢిల్లీ: తైపీ ఓపెన్ 2023 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ దుమ్మురేపాడు. అద్భుత ప్రదర్శనతో ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్కు చేరాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఏడో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ 21-9, 21-17 తేడాతో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగిర్తోపై విజయం సాధించాడు.
కేవలం 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో ప్రణయ్ పూర్తి ఆధిప్యం చెలాయించాడు. తిరుగులేని బేస్లైన్ గేమ్తో ప్రత్యర్థిని ఓడించి మరీ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లాడు. భారత్ నుంచి ఒకే ఒక్క ఆటగాడు మాత్రమే తైపీ టోర్నీలో పోరాడుతున్నాడు. తన తదుపరి మ్యాచ్లో ఐదో ర్యాంకర్ అగస్ నకాలాంగ్తో ప్రణయ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

ఈ ఏడాది ప్రణయ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. గత నెలలో జరిగిన మలేసియా మాస్టర్స్ 2023 టోర్నీలో సింగిల్స్ విజేతగా నిలిచిన ప్రణయ్.. ఇండోనేషియా ఓపెన్ సెమీఫైనల్లో ఓటమిపాలయ్యాడు. డెన్మార్క్కు చెందిన టాప్ సీడ్ అక్సెల్సెన్ 21-15, 21-15 తేడాతో ఏడో సీడ్ ప్రణయ్ను మట్టికరిపించాడు.
మరో సింగిల్స్ మ్యాచ్లో పారుపల్లి కశ్యప్ 16-21, 17-21 తేడాతో తైవాన్కు చెందిన ఎల్వై సూ చేతిలో ఓటమిపాలయ్యాడు. తైపీ ఓపెన్ టోర్నీకి భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ దూరంగా ఉన్నారు.
భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ సిక్కి రెడ్డి, రోహన్ కపూర్ పోరు ముగిసింది. తైపీకి చెందిన చియు హ్సియాంగ్ - లిన్ షియో చేతిలో 13-21, 18 -21 తేడాతో భారత జోడీ ఓడిపోయింది. మహిళా ప్లేయర్ తన్యా కామత్ కూడా 11-21, 6-21 తేడాతో తై జు యింగ్ చేతిలో పరాజయం పాలైంది.