మాడ్రిడ్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ ఏడాది వరుస పరాభవాల నుంచి బయటపడుతూ.. తొలిసారి ఓ టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో సింధు 24-22, 22-20తో సింగపూర్కు చెందిన యో జియా మిన్పై గెలుపొందింది.
వరుస వైఫల్యాలతో సతమతమై.. ఇటీవలే బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు కోల్పోయిన సింధు.. ఈ టోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించిన సింధు.. వరుస గేమ్ల్లో మ్యాచ్ను ముగించింది. తనదైన శైలిలో స్మాష్లు, క్రాస్కోర్టు షాట్లతో చెలరేగి వరుస గేమ్ల్లో ప్రత్యర్థిని మట్టికరిపించింది. 48 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ను ముగించిన సింధూ.. సింగపూర్ షట్లపై నేరుగా నాలుగో విజయాన్నందుకుంది.

ఆదివారం జరిగే ఫైనల్లో పీవీ సింధు.. టాప్ సీడ్, స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ లేదా ఇండోనేషియా షట్లర్ జార్జియా మరిస్కాలతో తలపడనుంది. ఈ ఇద్దరి మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో గెలిచే ప్లేయర్తో సింధు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. క్వార్టర్స్లో శ్రీకాంత్ 18-21, 15-21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్ నుంచి సింధు మాత్రమే పోటీలో ఉంది.