పారిస్ ఒలింపిక్స్ 2024 ముంగిట భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో సింధు పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సింధు 21-13, 11-21, 20-22 తేడాతో వరల్డ్ నెంబర్ 3 ర్యాంకర్ కరోలినా మారిన్(స్పెయిన్) చేతిలో పోరాడి ఓడింది.
గంటా 8 నిమిషాలు పాటు సాగిన ఈ పోరులో పీవీ సింధు విజయం కోసం ఆఖరి వరకు పోరాడింది. తొలి గేమ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దాంతో 21-13తో తొలి గేమ్ను సొంతం చేసుకుంది. కానీ రెండో గేమ్లో పుంజుకున్న రియో ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్ వరుస పాయింట్లతో చెలరేగింది.

సింధుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం చెలాయించిన స్పెయిన్ షట్లర్.. 11-21 తేడాతో రెండో గేమ్ను సొంతం చేసుకుంది. దాంతో డిసైడర్ గేమ్ ఆడాల్సి రాగా.. ఈ వరల్డ్ బెస్ట్ షట్లర్ హోరాహోరీగా తలపడ్డారు. మధ్యలో పుంజుకున్న సింధు వరుసగా పాయింట్లు సాధించి 18-15 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.
దాంతో సింధు విజయం లాంఛనమేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా పుంజుకున్న కరోలినా మారిన్ వరుస పాయింట్లతో 20-22తో గేమ్ను సొంతం చేసుకోవడంతో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. మరో రెండు నెలల్లో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా.. సింధు వరుస వైఫల్యాలు బ్యాడ్మింటన్ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.