కౌలలంపూర్: భారత స్క్వాష్ స్టార్ ప్లేయర్ సౌరవ్ గోషల్ చరిత్ర సృష్టించాడు. అద్భుత ప్రదర్శనతో మలేషియా ఓపెన్ స్క్వాష్ చాంపియన్షిప్ను సొంతం చేసుకున్నాడు. కౌలలంపూర్ వేదికగా శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సెకండ్ సీడ్ సౌరవ్ గోషల్ 11-7, 11-8, 13-11 తేడాతో టాప్ సీడ్ మిగ్యుల్ రోడ్రిగ్జ్(కొలంబియా)పై గెలుపొందాడు. దాంతో ఈ ఘనతను అందుకున్న తొలి భారత స్క్వాష్ ప్లేయర్గా సౌరవ్ గోషల్ గుర్తింపు పొందాడు.
55 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో వరుసగా మూడు గేమ్స్ గెలిచి సునాయస విజయాన్నందుకున్నాడు. ఈ విజయం పట్ల సౌరవ్ గోషల్ సంతోషం వ్యక్తం చేశాడు. తన కఠిన శ్రమకు దక్కిన ఫలితంగా అభివర్ణించాడు. 'ఈ ఫైనల్ హై క్వాలిటీ మ్యాచ్. మూడు గేమ్స్ల్లో తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా సెకండ్ గేమ్లో 0-7తో వెనుకంజలో ఉండి కమ్ బ్యాక్ చేయడం గొప్ప విశేషం. ఇదంతా నా కష్టానికి దక్కిన ప్రతిఫలం.'అని 35 ఏళ్ల సౌవర్ గోషల్ చెప్పుకొచ్చాడు.