
హైదరాబాద్: బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ బ్రాంజ్ మెడలిస్ట్ సాయి ప్రణీత్ థామస్ ఉబెర్కప్ నుంచి వైదొలిగాడు. కుడి మోకాలి నొప్పి కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం తెలిపాడు. 'లాక్డౌన్తో ఐదునెలలు కోర్టుకు దూరంగా ఉండడంతో ఫిట్నెస్ దెబ్బతింది. ఈనెల 6 నుంచి సాధన ప్రారంభించా కానీ, పూర్తిగా గాడిలో పడలేదు. కుడి మోకాలిలో కాస్త ఇబ్బంది అనిపించింది.
కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్ను సంప్రదించి ఎమ్ఆర్ఐ తీయించుకున్నా. పూర్తి స్థాయి ఆట ప్రారంభించే ముందు నా మజిల్స్ గట్టిగవడంపై దృష్టిసారించాలని డాక్టర్ సూచించారు. ఇప్పటికైతే ఇది గాయం కాదు. కానీ, ఫిట్నెస్ సందేహంగా ఉన్నప్పుడు డెన్మార్క్ వెళ్లి రిస్క్ తీసుకోలేను. వచ్చే జనవరిలో ఒలింపిక్స్ అర్హత పోటీలు ఉండడంతో సంపూర్ణ ఫిట్నెస్ సంతరించుకున్నాకే టోర్నీల బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నా. నవంబర్లో జరిగే ఏషియన్ సర్క్యూట్లో బరిలోకి దిగాలని కోరుకుంటున్నా'అని ప్రణీత్ పేర్కొన్నాడు.
ఇదే టోర్నీ నుంచి వ్యక్తిగత కారణాలతో స్టార్ షట్లర్ పీవీ సింధు తొలుత తప్పుకోగా, ఆ తర్వాత జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య విజ్ఞప్తితో ఆమె తిరిగి భారత బృందంలో చేరిన విషయం తెలిసిందే. సింధు చేరికతో జోష్ వచ్చిందని ఆనందపడుతున్న తరుణంలో టోర్నీ నుంచి ప్రణీత్ తప్పుకుంటున్నాడన్న వార్త బ్యాడ్మింటన్ అభిమానులను నిరాశపరిచింది. ప్రణీత్ తప్పుకోవడంతో భారత పురుషుల బృందాన్ని కిడాంబి శ్రీకాంత్ నడిపించనున్నాడు. అతడితో పాటు కశ్యప్, లక్ష్యసేన్, శుభాంకర్ డే జట్టులో ఆడనున్నారు.
ఇక భారత పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ కూడా ఈ ఉబెర్ కప్కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తెలుగు ప్లేయర్ సాత్విక్ ఇటీవల కరోనా బారిన పడడమే ఇందుకు కారణం. ఈ మేరకు బాయ్కు సమాచారమిచ్చారు. నేషనల్ స్పోర్ట్స్ డేకు కొద్ది రోజుల ముందు సాత్విక్ కరోనా పాజిటివ్గా తేలాడు. దాంతో అర్జున అవార్డు కూడా అందుకోలేకపోయాడు. శనివారంతో సాత్విక్ క్వారంటైన్ పూర్తయింది. మరోసారి కరోనా టెస్ట్ చేయించుకోనున్నాడు. ఇందులో నెగెటివ్ వచ్చినా.. మరో పది రోజులు దాకా ప్రాక్టీస్కు రాలేడు. భాగస్వామి అందుబాటులో లేకపోవడంతో చిరాగ్ కూడా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. వీరి నిర్ణయానికి బాయ్ కూడా ఓకే చెప్పింది.