ఈ ఏడాది తొలి టైటిల్ గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. అద్వితీయమైన ప్రదర్శనతో క్వార్టర్స్ చేరిన తెలుగు తేజం ముందడుగు వేయలేకపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 14వ ర్యాంకర్ సిందు14-21, 13-21 తేడాతో వరల్డ్ నెంబర్ వన్ అన్ సే యంగ్(సౌత్ కొరియా) చేతిలో చిత్తయ్యింది.
38 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో యంగ్ ఆధిపత్యం ముందు సింధు తేలిపోయింది. ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. యంగ్ చేతిలో సింధుకు ఇది వరుసగా 8వ ఓటమి. ఇప్పటి వరకు ఈ సౌత్ కొరియా ప్లేయర్పై సింధు ఒక్క సింగిల్స్ మ్యాచ్ గెలవలేదు. ఈ మ్యాచ్లో గెలిచిన అన్ సే యంగ్.. సెమీఫైనల్లో అకనే యమగూచితో తలపడుతోంది.

గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్లో సింధు 21-15, 21-15తో ఆరో సీడ్ పోర్న్పవీ చోచువాంగ్ (థాయ్లాండ్)పై గెలిచింది. 14వ ర్యాంకర్ అయిన సింధు ఆరో ర్యాంకర్ను ఓడించడంతో ఫామ్లోకి వచ్చిందని అంతా అనుకున్నారు. కానీ సౌత్ కొరియా ప్లేయర్ను సింధు ఓడించలేక ఇంటి దారి పట్టింది.
భారత డబుల్స్ ఏస్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టిలు కూడా ఈ టోర్నీలో క్వార్టర్ఫైనల్స్కు దూసుకెళ్లారు. డబుల్స్లో 8వ సీడ్ సాత్విక్ ద్వయం 21-13, 21-12తో తైపీ జంట సియాంగ్ చీ చియు-వాంగ్ చి లిన్ను ఓడించింది.