భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో సింధు వివాహాం ఆదివారం ఘనంగా జరిగింది. రాజస్థాన్, ఉదయ్పూర్లోని ఓ దీవిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రాత్రి 11.20 గంటలకు మూడు ముళ్ల బంధంతో సాయి-సింధు ఒక్కటయ్యారు. ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది.
తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా పూర్తి శాస్త్రబద్ధంగా ఈ పెళ్లిని నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిపి మొత్తం 140 మంది ముఖ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో తెలుగుదనంతో పాటు రాజస్థాన్ రాచరిక సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వర్నాథ్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్తో పాటు ప్రముఖ వైద్యుడు గురువారెడ్డి తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్లో వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్కు సినీ, రాజకీ, క్రీడా ప్రముఖులు హాజరవ్వనున్నారు.
ఆరావళి పర్వతాల మధ్య ఉదయ్సాగర్ సరస్సులో 21 ఎకరాల్లో ఈ దీవి విస్తరించి ఉండగా.. రఫల్స్ సంస్థ రాజభవనాలను తలపించే రిసార్ట్ను నిర్మించింది. ఈ రిసార్ట్లో 100 గదులతో మూడు ప్రధాన భవంతులు ఉన్నాయి. ఈ రిసార్ట్లో సాధారణ గదికి ఒక్క రోజు రెంట్ సుమారు లక్ష రూపాయలు. సింధు పెళ్లి నిమిత్తం అతిథుల కోసం ఈ 100 గదులను బుక్ చేశారు. ఈ పెళ్లికి వచ్చిన వారికి సింధు కుటుంబం విమాన టికెట్లు కూడా బుక్ చేసింది.