భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాడ్మింటన్కు స్వల్ప విరామం ప్రకటించింది. ఈ ఏడాదిలో మిగిలిన అన్ని బీడబ్ల్యూఎఫ్ టోర్నీలకు దూరంగా ఉంటానని తెలిపింది. పాదం గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. తన టీమ్తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ను పంచుకుంది.
'ప్రముఖ డాక్టర్ పార్ధివాలాతో పాటు నా టీమ్ సూచనలతో ఈ ఏడాదిలో మిగిలిన అన్ని బీడబ్ల్యూఎఫ్ టోర్నీల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. యూరోపియన్ టోర్నీకి ముందు అయిన పాదం గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. టోర్నీలకు దూరంగా ఉండటం కాస్త కష్టమే. కానీ గాయాలు ప్రతి క్రీడాకారుడి జీవితంలో భాగమే. అవి అథ్లెట్ల పట్టుదల, సహనాన్ని పరీక్షిస్తాయి. మరింత బలంగా తిరిగి రావాలనే కసిని కూడా కలిగిస్తాయి.

రికవరీ ట్రైనింగ్ ఇప్పటికే మొదలైంది. డాక్టర్ వేన్ లంబార్డ్ పర్యవేక్షణలో నిషా రావత్ సాయం, నా కోచ్ ఇర్వాన్ స్యా గైడెన్స్లో కోలుకుంటున్నాను. నాపై వారికున్న నమ్మకం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. రాబోయే రోజుల కోసం ప్రేరణ, కృతజ్ఞతతో మరింత ఉత్సాహంగా ఉన్నాను. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. ఇది మాటల్లో చెప్పలేనంత విలువైనది.'అని పీవీ సింధు పేర్కొంది.
చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీ తర్వాత సింధు మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టలేదు. ఈ టోర్నీలో సింధు సెమీస్కే పరిమితమైంది. సింధు తాజా నిర్ణయంతో అర్కిటెక్ ఒపెన్, డెన్మార్క్ ఒపెన్, ఫ్రెంచ్ ఒపెన్కు దూరం కానుంది.
30 ఏళ్ల సింధు తన కోచ్ ఇర్వాన్ స్యాతో జతకట్టిన తర్వాత అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. తన మునపటి ఫామ్లోకి తిరిగొచ్చే సంకేతాలను ఇచ్చింది. రికవరీకి టైమ్ కేటాయించాలని, వరుస టోర్నీలు ఆడవద్దని బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్లు ప్రకాష్ పదుకొణె, విమల్ కుమార్ ఇచ్చిన సలహాలను సింధు పరిగణలోకి తీసుకుంది.
పారిస్ వేదికగా ఈ ఏడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో సింధు వలర్డ్ నెంబర్ 2 వాంగ్ జీ ఈని ప్రీ క్వార్టర్లో ఓడించింది. కానీ పుత్రి కుసుమ వార్దని చేతిలో ఓటమిపాలైంది. ఇటీవల కాలంలో టైటిల్స్ గెలవడంలో సింధు తడబడుతుంది. ఆమె చివరి సారిగా లక్నో వేదికగా జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టైటిల్ గెలిచింది.