గాయం నుంచి కోలుకొని కొత్త సీజన్లో తొలి టోర్నీ బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుమ్మురేపుతోంది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో సింధు సెమీఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మధ్యలోనే జపాన్ ప్లేయర్ అకానే యమగుచి గాయంతో తప్పుకోవడంతో సింధు సెమీస్కు దూసుకెళ్లింది. యమగుచి ఆట నుంచి తప్పుకోవడానికి ముందు సింధు 21-11తో తొలి గేమ్ను గెలుచుకుంది.
ఈ విజయంతో ప్రపంచ మూడో ర్యాంకర్ యమగుచితో ముఖాముఖి పోరును 15-12తో 18వ ర్యాంకర్ సింధు మెరుగుపర్చుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో చైనా షట్లర్, రెండో సీడ్ వాంగ్ జియితో సింధు తలపడనుంది.

ఈ టోర్నీ తొలి రౌండ్లో సింధు 21-14, 22-20తో సుంగ్ షువో యున్(చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ప్రిక్వార్టర్స్లో సింధు 21-8, 21-13తో ప్రపంచ 9వ ర్యాంకర్ టొమోకా మియజకి(జపాన్)ను ఓడించింది. కేవలం 33 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ను సింధు ముగించడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో యమగుచి గాయం సింధుకు కలిసొచ్చింది.
పురుషుల డబుల్స్లో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి పోరాటం క్వార్టర్స్లో ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 10-21, 21-23 తేడాతో ఎమ్ఎస్ ఫిక్రి-ఎఫ్ అల్ఫియాన్ జోడి చేతిలో ఓటమిపాలైంది.