మలేషియా ఓపెన్ 2024 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టిల పోరాటం ఫైనల్లో ముగిసింది. అనవసర తప్పిదాలతో ఫైనల్ మ్యాచ్లో ఓడిన భారత ద్వయం తృటిలో టైటిల్ చేజార్చుకొని రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఈ ఫైనల్లో భారత ద్వయం 21-9, 18-21, 17-21 తేడాతో చైనా జోడీ లియాంగ్ వు కెంగ్- వాంగ్ చాంగ్ చేతిలో ఓటమిపాలైంది.
రాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో తొలి సెట్ గెలిచి జోరు కనబర్చిన భారత ద్వయం అనూహ్యంగా చివరి రెండు సెట్లలో ఓటమిపాలైంది. తొలి సెట్లోనే భారత ద్వయం ఆధిపత్యం చెలాయించింది. సూపర్ గేమ్ ప్లాన్తో వచ్చిన సాత్విక్-చిరాగ్.. చైనా జోడీ బలహీనతలపై దెబ్బ కొడుతూ పాయింట్లు సాధించారు.

పదే పదే ప్రత్యర్థి శరీరాలపై దాడి చేసిన భారత జోడీ.. వారు అనవసర తప్పిదాలు చేసేలా ఒత్తిడి తెచ్చింది. దాంతో భారత్ ద్వయం 21-9 భారీ తేడాతో తొలి సెట్ను కైవసం చేసుకుంది. రెండో సెట్లో చైనా జోడీ నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంది. భారత ఆటగాళ్ల బలహీనతలను టార్గెట్ చేస్తూ పాయింట్లు సాధించింది.
కాస్త తడబాటుకు గురైన భారత్ ద్వయం అనవసర తప్పిదాలు చేసింది. దాంతో సెకండ్ సెట్ ఫస్టాఫ్ ముగిసే సరికి చైనా జోడీ 11-6తో భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో వరుస పాయింట్స్ సాధించిన భారత్ ద్వయం ఆధిక్యాన్ని 14-12కు తగ్గించింది. ఇక్కడి నుంచి మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇరు దేశాల ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు.
దాంతో ఒక్కో పాయింట్తో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. దాంతో చైనా ఆధిక్యం 19-18కు ఒక్క పాయింట్గా మారింది. ఈ పరిస్థితుల్లో పట్టుదలతో ఆడిన చైనా ద్వయం వరుసగా రెండు పాయింట్లు సాధించి 21-18తో రెండో సెట్ను కైవసం చేసుకొంది. దాంతో డిసైడర్ సెట్ ఆడాల్సి వచ్చింది. చివరి సెట్లోనూ ఇరు దేశాల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు.
నెక్-టు నెక్గా సాగిన ఈ పోరులో కీలక సమయంలో భారత ద్వయం చేసిన తప్పిదాలు చైనా జోడీకి కలిసొచ్చింది. దాంతో చెలరేగిన చైనా ద్వయం 21-17తో మూడో సెట్ గెలవడంతో పాటు మ్యాచ్ను గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది.