కౌలలాంపూర్: మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సిడ్ సింధు 21-13, 21-17 తేడాతో థాయ్లాండ్ ప్లేయర్, పదో సీడ్ పోన్పావి చోచువోంగ్పై గెలుపొందింది. వరుసగా రెండు సెట్స్లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెండో సెట్లో థాయ్లాండ్ ప్లేయర్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనప్పటికీ సింధు తన అనుభవంతో విజయాన్నందుకుంది.
మహిళల సింగిల్స్ మరో మ్యాచ్లో 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్ చేతిలో సైనా నెహ్వాల్ 11-21, 17-21 తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు డబుల్స్లో బి సుమీత్ రెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీ.. నెదర్లాండ్స్ జోడీ రాబిన్ టాబెలింగ్-సెలెనా పీక్ చేతిలో 15-21, 21-19 17-21 తేడాతో ఓటమిపాలవ్వగా, పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభాన్ని అందుకున్నాడు. ప్రణయ్.. స్థానిక ఆటగాడు ల్యూ డారెన్పై 21-14, 17-21, 21-18తేడాతో గెలుపొంది రెండో రౌండ్లో ప్రవేశించాడు.
మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్ల్లో తెలుగు షట్లర్ సాయి ప్రణీత్ ఇంటిదారిపట్టాడు. తొలి రౌండ్లో సాయి ప్రణీత్ 15-21, 21-19, 9-21తో ఆరో ర్యాంకర్ ఆంథోని సినిసుక గింటింగ్(ఇండోనేషియా) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్లో సమీర్ వర్మ 14-21, 21-13, 7-21తో ఎనిమిదో ర్యాంకర్ జోనాథన్ క్రిస్టీ(ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్లో ఏడో సీడ్ సాత్విక్-చిరాగ్ 21-18, 21-11తో మన్ వీ చోంగ్-కైఫున్ టీ(మలేసియా) జంటను ఓడించి రెండో రౌండ్కు చేరింది.