కౌలాలంపూర్: ఫిట్నెస్ సమస్యలో ఈ ఏడాదిని పేలవంగా ప్రారంభించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు ఫామ్ అందుకుంది. మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో అసాధారణ ఆటతీరుతో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గత నెలలో జరిగిన స్పెయిన్ మాస్టర్స్లో ఫైనల్ వరకు చేరిన పీవీ సింధు తుది మెట్టుపై బోల్తా పడింది.
కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్ టోర్నీలో అదే జోరును కొనసాగించిన సింధు.. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో 21-16, 13-21, 22-20తో చెనా షట్లర్ జాంగ్ యి మాన్ను ఓడిచింది. తొలి గేమ్ను సునాయసంగా గెలిచిన సింధుకు రెండో గేమ్లో చైనా షట్లర్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ప్రత్యర్థి పూర్తి ఆధిపత్యం చెలాయించడంతో గేమ్ను కోల్పోయింది.

నిర్ణాయక మూడో గేమ్లో నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. ఓవైపు సింధు తన ట్రెడ్ మార్క్ స్మాష్లతో విరచుకుపడినా.. చైనా షట్లర్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో సింధు 21-16, 21-11తో అయా ఒహొరి (జపాన్)పై విజయం సాధించింది. గంట పాటు జరిగిన మ్యాచ్లో సింధు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది.
పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ ఒక్కడే సెమీఫైనల్ చేరాడు. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో ప్రణయ్ 25-23, 18-21, 21-13 తేడాతో జపాన్ ప్లేయర్ కెంటా నిషిమొటొను చిత్తు చేశాడు. తొలి గేమ్ నుంచే ఇరువురు హోరాహోరీగా తలపడ్డారు. క్వార్టర్స్లో ప్రణయ్ 13-21, 21-16, 21-11తో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ షై ఫెంగ్ (చైనా)పై గెలుపొందిన విషయం తెలిసిందే.
మరో ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ పోరాటం క్వార్టర్స్కే పరిమితమైంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో 21-19, 21-19తో ప్రపంచ అయిదో ర్యాంకు ఆటగాడు కున్లావత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)కు షాకిచ్చిన శ్రీకాంత్.. కీలక క్వార్టర్స్లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయాడు. శుక్రవారం జరిగిన ఈ పోరులో శ్రీకాంత్ 21-16, 16-21, 11-21 తేడాతో ఇండోనేషియా ప్లేయర్ క్రిస్టియన్ ఎడినాట చేతిలో ఓటమిపాలయ్యాడు.
అసాధారణ ఆటతో తొలి గేమ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీకాంత్ అద్భుత విజయాన్నందుకున్నాడు. కానీ ఇండోనేషియా ప్లేయర్ ధీటుగా బదులివ్వడంతో శ్రీకాంత్ చేతులెత్తేసాడు. ఒత్తిడికి గురైన శ్రీకాంత్ అనవసర తప్పిదాలతో ప్రత్యర్థికి అవకాశం ఇచ్చాడు. దాంతో వరుసగా రెండు గేమ్ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.