
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ సెమీఫైనల్ చేరగా.. ఒలింపిక్ విజేత పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ తై జూయింగ్ (చైనీస్ తైపీ) చేతిలో సింధూ ఓటమి పాలైంది. 55 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో 13-21, 21-12, 12-21 తేడాతో సింధూ పరాజయం పాలైంది. తొలి సెట్లో ఓడిపోయిన సింధు, రెండో సెట్లో పుంజుకుని విజయం సాధించింది.
అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో తైజు.. సింధుకు అవకాశం ఇవ్వకుండా చేలరేగి ఆడింది. అదరిపోయే క్రాస్ కోర్ట్ షాట్లతో ఆధిపత్యం చెలాయించింది. దీంతో సింధుపై మరో విజయాన్ని తైజు తన ఖాతాలో వేసుకుంది. కాగా తై జూయింగ్ చేతిలో సింధుకు వరుసగా ఇది ఏడో ఓటమి కావడం గమనార్హం. ఇక ఇటీవల జరిగిన మలేషియా ఓపెన్ క్వార్టర్ఫైనల్స్లోను సింధూపై తై జూ గెలుపొందింది. ఇక ఓవరాల్గా ఇప్పటి వరకు 22 మ్యాచ్ల్లో వీరిద్దరూ తలపడగా.. 5 మ్యాచ్ల్లో సిందూ,17 మ్యాచ్ల్లో తై జూ విజయం సాధించింది.
పురుషుల క్వార్టర్ ఫైనల్లో హెచ్ఎస్ప్రణయ్ 25-23, 22-20 తేడాతో ప్రపంచ 14వ ర్యాంకర్, జపాన్ స్టార్ కంటా త్సునెయమాను ఓడించాడు. 60 నిమిషాల పాటు జరిగిన పోరులో ప్రణయ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. జపాన్ షట్లర్ నుంచి కొంత ప్రతీ ఘటన ఎదురైనా ప్రణయ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. సాయి ప్రణీత్, కశ్యప్ ప్రీ క్వార్టర్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఏడో సీడ్ సింధు 21-12, 21-10తో జాంగ్ యి మన్ (చైనా)పై విజయం సాధించింది. సంపూర్ణ ఆధిపత్యంతో సత్తాచాటిన సింధు కేవలం 28 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఆ జోరును మాత్రం క్వార్టర్ ఫైనల్లో చూపించలేకపోయింది.