వివాహ బంధంలోకి అడుగు పెట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. తన లవ్ స్టోరీని బయటపెట్టింది. తొలి చూపులోనే తన భర్తపై ప్రేమ పుట్టిందని తెలిపింది. తన స్నేహితుడు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పీవీ సింధు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 22న రాజస్థాన్లోని ఉదయ్ సాగర్ సరస్సులో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.
అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్లి ఫొటోలను పీవీ సింధు సోషల్ మీడియా వేదికగా లవ్ సింబల్ ఏమోజీతో అభిమానులతో పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ లవ్ స్టోరీని పంచుకున్న సింధు.. ఓ విమాన ప్రయాణంతో తమ లవ్ జర్నీ మొదలైందని చెప్పింది. ఆ ప్రయాణంలో తొలి చూపులోనే తన భర్తపై ప్రేమ కలిగిందని తెలిపింది.

'రెండేళ్ల క్రితం అక్టోబర్లో మేమిద్దం కలిసి ఓ విమానంలో ప్రయాణించాం. ఆ ప్రయాణం తర్వాత మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మేం చాలా దగ్గరయ్యాం. అదంతా లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా అనిపించింది. ఆ క్షణం నుంచి మా లవ్ జర్నీ మొదలైంది.
చాలా తక్కువ మంది సమక్షంలో మేం నిశ్చితార్థం చేసుకున్నాం.
మా జీవితంలో అత్యంత కీలకమైన ఈ ఘట్టాన్ని మేం మాములుగా చేసుకోవాలనుకున్నాం. అది చాలా భావోద్వేగభరిత క్షణం. ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. పెళ్లి విషయంలోనూ మేం చాలా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాం. బిజీ షెడ్యూల్ ఉన్నా.. మా వివాహాన్ని ఉత్తమంగా ప్లాన్ చేసుకున్నాం.'అని సింధు చెప్పుకొచ్చింది.
పీవీ సింధు-వెంకట దత్త సాయిల వివాహ విందు మంగళవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని అన్వయ కన్వెన్షన్లో జరిగిన ఈ రిసెప్షన్కు సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా పీవీ సింధు-వెంకట దత్త సాయిలకు ఆశీస్సులు అందించారు. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సుజనా చౌదరి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అర్జున్, అలీ, మృణాల్ ఠాకూర్, అజిత్లు ఈ వేడుకలో భాగమయ్యారు. క్రీడా రంగం నుంచి భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, బ్యాడ్మింటన్ ప్లేయర్లు గురుసాయి దత్, ప్రణయ్, చిరాగ్ శెట్టి, చాముండేశ్వరినాథ్లు హాజరయ్యారు.