యోసు: కొరియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్శెట్టి ఫైనల్కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సాత్విక్- చిరాగ్ ద్వయం 21-15, 24-22 తేడాతో వరల్డ్ నెంబర్ 2 జోడీ, చైనాకు చెందిన లియాగ్ కెంగ్, వాంగ్ చాంగ్ను మట్టికరిపించారు.
చైనీస్ జంటపై సాత్విక్ చిరాగ్ జోడీకి ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఇది వరకు రెండు సార్లు తలపడగా.. రెండు సార్లు భారత జోడీకి నిరాశే ఎదురైంది. 40 నిమిషాల పాటు సాగిన సెమీస్లో సాత్విక్-చిరాగ్ జోడీ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్లో 9 పాయింట్ల వరకు నువ్వానేనా అన్నట్లు ఇరు జోడీలు తలపడ్డాయి.

అయితే వరుసగా 5 పాయింట్లు నెగ్గి 14-8తో ఆధిక్యంలోకి వెళ్లిన సాత్విక్- చిరాగ్ జోడీ బలమైన స్మాష్లతో అదే జోరు కొనసాగిస్తూ తొలి గేమ్ను సొంతం చేసుకుంది. ప్రత్యర్థి జోడీ మరో 8 పాయింట్లు సాధించేలోపే తొలి గేమ్ను ముగించింది. రెండో గేమ్లో చైనీస్ జోడీ నుంచి సాత్విక్-చిరాగ్ జోడీకి ఊహించని ప్రతిఘటన ఎదురైంది.
ఇరు జోడీలు సమంగా పాయింట్లు రాబట్టాయి. గేమ్ పాయింట్ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు అద్భుతమైన ఆటతీరుతో భారత జోడీ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్తో పాటు మ్యాచ్ను గెలుచుకుంది. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 టైటిల్ నెగ్గిన సాత్విక్-చిరాగ్ జోడీ.. ఈ ఏడాది మూడో ఫైనల్ ఆడేందుకు సిద్దమైంది.
ఇండోనేసియా జోడీ ఫజర్-రియాన్, కొరియా జోడీ మిన్-సియో మధ్య జరిగే మ్యాచ్ గెలిచే జోడీతో భారత జోడీ టైటిల్ ఫైట్లో తలపడనుంది. కొరియా ఓపెన్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లలోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.