టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్ శుభారంభం చేశారు. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో శ్రీకాంత్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-13, 21-13తో చౌ తీన్ చెన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించగా.. ప్రణయ్ 21-17, 21-13తో లీ షై ఫెంగ్ (చైనా)ను ఓడించాడు. అయితే ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్తో ప్రణయ్ తలపడనుండటం గమనార్హం. ఇద్దరిలో ఒక్కరు మాత్రమే క్వార్టర్ఫైనల్ చేరుకోనున్నారు.

మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ విజయం సాధించింది. తొలి రౌండ్లో గాయత్రి-ట్రీసా జోడీ 11-21, 21-15, 21-14తో సయాక హొబార- యు సూజు (జపాన్) ద్వయాన్ని ఓడించి ప్రిక్వార్టర్స్ చేరుకుంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆకర్షి కశ్యప్ 17-21, 17-21తో టాప్ సీడ్ అకానె యమగూచి (జపాన్) చేతిలో ఓటమిపాలైంది.
మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ కపూర్- సిక్కిరెడ్డి జోడీ 21-18, 9-21, 18-21తో హాంగ్ వీ- చియా సిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలైంది. ఇక భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ విజేత పీవీ సింధుకు ఈ టోర్నీలో కఠిన సవాల్ ఎదురైంది.
తొలి రౌండ్లో ఆమె చైనాకు చెందిన జాంగ్ యి మన్తో పోటీ పడనుంది. ఈ ఏడాది సింధు పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఈ సీజన్లో ఆడిన 12 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఈవెంట్లో ఆమె ఆరింటిలో ఫస్ట్ రౌండ్లోనే ఓటమిపాలైంది.
ఒలింపిక్స్కు సరిగ్గా ఏడాది ఉండగా సింధు గాడిలో పడాల్సిన సమయం ఆసన్నమైంది. నేడు మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే తొలి రౌండ్లో జాంగ్ యి మన్ను ఓడిస్తే తై జుయింగ్ రూపంలో కఠిన సవాల్ ఎదురవ్వనుంది.
ఇక కొరియా ఓపెన్తో ఈ సీజన్లో నాలుగో టైటిల్ అందుకున్న భారత డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఈ టోర్నీలో ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నారు. తొలి రౌండ్లో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ-డేనియల్తో పోరు ఆరంభించనున్నారు.