జపాన్ మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీలో భారత వెటరన్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో టూ టైమ్ ఒలింపిక్స్ మెడలిస్ట్ సింధు 21-12, 21-8 తేడాతో థాయ్లాండ్కు చెందిన ఎనిమిదో సీడ్ బుసానన్ను ఓడించింది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
వరుస గేమ్ల్లో గెలిచి బుసానన్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ ఆరంభంలో తడబడిన సింధు 5-7తో వెనుకంజలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా పాయింట్స్ సాధించి బ్రేక్ సమయానికి 11-9తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత తెలుగు తేజం వెనక్కి తిరిగి చూసుకోలేదు. చివరి 13 పాయింట్లలో 11 పాయింట్స్ సాధించి తొలి గేమ్ను కైవసం చేసుకుంది.

రెండో గేమ్లోనూ అదే జోరు కొనసాగించిన సింధు.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచే ఆధిక్యం కొనసాగించి 11-7తో నిలిచింది. ఆ తర్వాత 12 పాయింట్స్లో 11 పాయింట్స్ కైవసం చేసుకొని గేమ్తో పాటు మ్యాచ్ గెలిచింది.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్న సింధుకు ఈ విజయం ఊరట ఇవ్వనుంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత సింధు ఏ టోర్నీలోనూ ప్రీక్వార్టర్స్ ధాటలేదు. ఫిన్లాండ్ వేదికగా జరిగిన ఆర్క్టిక్ ఓపెన్లో తొలి రౌండ్లోనే విఫలమైన సింధు.. డెన్మార్క్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది.
లక్ష్యసేన్ ఓటమి..
పురుషుల సింగిల్స్లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ 22-20, 17-21, 16-21 తేడాతో జపాన్ షట్లర్ లియోంగ్ జున్ హవో చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈ మ్యాచ్లో తొలి గేమ్ గెలిచి ఆధిక్యంలో నిలిచిన లక్ష్యసేన్.. అనూహ్యంగా తర్వాతి రెండు గేమ్స్ కోల్పోయాడు. గంటా 14 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు.
పారిస్ ఒలింపిక్స్ కాంస్య పోరులో లీ జీ జియా చేతిలో ఓడిన తర్వాత లక్ష్యసేన్కు కలిసి రావడం లేదు. బరిలో దిగిన ప్రతీ టోర్నీలోనూ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. తాజా టోర్నీకి ముందు జరిగిన ఆర్క్టిక్ ఓపెన్, డెన్మార్మ్ ఓపెన్లోనూ తొలి రౌండ్స్లోనే ఓడి ఇంటిదారి పట్టాడు.