బాలి: భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి జోడీ కూడా సెమీఫైనల్కు చేరింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో మూడో సీడ్ సింధు 14-21, 21-19, 21-14తో సిమ్ యుజిన్ (కొరియా)పై గెలుపొందింది. 66 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ప్రత్యర్థిపై సింధు పైచేయి సాధించింది. తొలి గేమ్ కోల్పోయినా వెంటనే కమ్ బ్యాక్ చేసిన తెలుగు షట్లర్ ముందంజ వేసింది. శనివారం జరిగే సెమీస్లో రెండో సీడ్ రచనోక్ ఇంటనోస్(థాయ్లాండ్)తో పోటీపడనుంది.
గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో సింధు 21-12, 21-18తో వైవోన్ లీ (జర్మనీ)పై అలవోక విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో టోర్నీ మూడో సీడ్ సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో ఆరో సీడ్ సాత్విక్- చిరాగ్ 21-19, 21-19తో జో ఫెయ్- నూర్ ఐజుద్దీన్ (మలేసియా)పై నెగ్గారు. నేడు(శనివారం) జరిగే సెమీఫైనల్స్లో టాప్ సీడ్ మార్కస్ గిడియోన్- కెవిన్ సుకములో (ఇండోనేసియా)తో సాత్విక్- చిరాగ్ తలపడతారు.
పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21-15, 19-21, 23-21తో కంగ్ మిన్హ్యూక్- సియో సెంగ్జే (కొరియా) జంటపై నెగ్గి ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్లో సాయి ప్రణీత్ పోరాటం ముగిసింది. క్వార్టర్స్లో సాయి ప్రణీత్ 12-21, 8-21తో రెండో సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు.
బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్కు భారత మహిళల డబుల్స్ జంట సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప (భారత్) అర్హత సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీ చరిత్రలో బరిలోకి దిగనున్న తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా సిక్కి-అశ్విని గుర్తింపు పొందింది. డిసెంబర్ 1 నుంచి 5 వరకు బాలిలో జరిగే ఈ టోర్నీకి మహిళల సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా అర్హత సాధించడం దాదాపుగా ఖాయమైంది.