జకార్త: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ టాప్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టిలు అదరగొట్టారు. ఈ స్టార్ ద్వయం వరల్డ్ నెంబర్ వన్ జోడీకే షాకిచ్చి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మరో వెటరన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ పురుషుల సింగిల్స్లో సెమీస్ చేరి ట్రోఫీకి రెండడుగుల దూరంలో నిలిచాడు.
ఇక, ఇటీవలికాలంలో వరుసగా విఫలమవుతున్న కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నీలోనూ నిరాశపరిచాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో శ్రీకాంత్ 14-21, 21-14, 12-21తో ప్రపంచ పదో ర్యాంకర్, చైనా షట్లర్ లి షి ఫెంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు.

మరో క్వార్టర్స్ మ్యాచ్లో ఏడోసీడ్ హెచ్ఎస్ ప్రణయ్ 21-18, 21-16తో జపాన్ స్టార్, మూడోసీడ్ నరవొకను యాభై ఐదు నిమిషాల్లో చిత్తుచేశాడు. ఫైనల్ బెర్త్కోసం టాప్సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్)తో ప్రణయ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. అక్సెల్సెన్ 21-5, 21-19తో ఐదోసీడ్ తిన్ చెన్ చో (చైనీస్ తైపీ)ని ఓడించాడు.
ఇక పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో ఏడో సీడ్ ద్వయం సాత్విక్-చిరాగ్ 21-13, 21-13తో ఇండోనేసియాకు చెందిన టాప్సీడ్ జంట ఫజర్ అల్ఫియాన్-మహ్మద్ రియాన్ను వరుసగేముల్లో ఓడించి ఇంటికి పంపింది. ఆరంభం నుంచే దీటుగా ఆడిన భారత జోడీ కేవలం 41 నిమిషాల్లోనే ప్రత్యర్థి జోడీని మట్టికరిపించింది.
తిరుగులేని బేస్లైన్ గేమ్తో పాటు సుదీర్ఘమైన ర్యాలీలతో ఆకట్టుకుంది. 4-0తో తొలి గేమ్ను మొదలుపెట్టిన సాత్విక్-చిరాగ్ జోడీ మధ్యలో కాస్త తబడింది. ఈ దశలో క్రాస్ కోర్టు విన్నర్స్ కొట్టిన సాత్విక్ వరుసగా రెండు, ఆరు పాయింట్లు రాబట్టడంతో స్కోర్ 14-6కు పెరిగింది.
అనంతరం అదే జోరును కొనసాగించిన భారత్ ద్వయంతో బలమైన స్మాష్లతో ఈజీగా తొలి గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించిన చిరాగ్ జోడీ.. 20-10తో ఆధిక్యంలో నిలిచారు. చివర్లో సూపర్ డ్రాప్తో చిరస్మరణీయ విజయాన్నందుకున్నారు. కొరియా జంట మిన్ హ్యూక్-సియోంగ్తో సాత్విక్ జోడీ సెమీఫైనల్ ఆడనుంది.