జకార్తా: థామస్ కప్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ టీమ్లో సభ్యుడైన హెచ్ఎస్ ప్రణయ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. అయిదేళ్ల టైటిల్ కరవుకు ముగింపు పలకాలనే పట్టుదలతో ఉన్న ప్రణయ్ గురువారం జరిగిన పురుషుల ప్రి క్వార్టర్స్లో 21-11, 21-18 తేడాతో లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలిచాడు.
మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 41 నిమిషాల్లో ప్రత్యర్థి కథ ముగించాడు. మరోవైపు మిగతా భారత షట్లర్లు తమ మ్యాచ్ల్లో పరాజయం చెందారు. సింగిల్స్లో సమీర్ వర్మ 10-21, 13-21తో ప్రపంచ అయిదో ర్యాంకర్ లీ జీ జియా (మలేసియా) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్లో అశ్విని- సిక్కి జోడీ 16-21, 13-21తో టాప్ సీడ్ చెన్ క్వింగ్- యీ ఫాన్ (చైనా) చేతిలో తలవంచింది. పురుషుల డబుల్స్లో అర్జున్- ధ్రువ్ 19-21, 15-21 తో చెన్- జువాన్ (చైనా) చేతిలో ఓడారు.
భారత స్టార్ షట్లర్లు ప్రపంచ 11వ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్, ప్రపంచ పదో ర్యాంకర్ లక్ష్య సేన్, మాజీ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు, సాయి ప్రణీత్లు తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21-23, 10-21తో ప్రపంచ 41వ ర్యాంకర్బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమిపాలయ్యాడు. తొలి రౌండ్లో ప్రణయ్ 21-10, 21-9తో 8వ సీడ్ లక్ష్యసేన్పై విజయం సాధించాడు.
మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ సింధు 14-21, 18-21తో హి బింగ్ జియావో (చైనా) చేతిలో ఓడింది. 47 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సింధు క్రాస్ కోర్ట్ షాట్స్ ఆడటంలో ఇబ్బంది పడింది. పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ 16-21, 19-21తో హన్స్ క్రిస్టియన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు.