జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. భారీ ఆశలు పెట్టుకున్న పీవీ సింధు, లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటి ముఖం పట్టారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 12-21, 10-21తో ఎనిమిదో ర్యాంకర్ రచనోక్ ఇంతనోస్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో ఏదశలోనూ సింధు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది.
రచనోక్ అటాకింగ్, డిఫెన్స్లో సూపర్ షో చూపెట్టింది. దీంతో సింధుకు ఎక్కడా కోలుకునే అవకాశమే రాలేదు. స్పష్టమైన ఆధిక్యంతో తొలి గేమ్ను గెలిచిన రచనోక్.. రెండో గేమ్లో మరింత దూకుడుగా ఆడింది. ఎక్కడా స్కోరు సమం చేసే చాన్స్ కూడా ఇవ్వలేదు. రచనోక్ చేతిలో సింధుకిది తొమ్మిదో పరాజయం. 2018 వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో చివరిసారి రచనోక్పై నెగ్గిన సింధు ఆ తర్వాత ఈ థాయ్ ప్లేయర్తో జరిగిన ఆరు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 62 నిమిషాల్లో 16-21, 21-12, 14-21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. నెల రోజుల్లో ఇదే ప్రత్యర్థి చేతిలో ఓడటం సేన్కు ఇది రెండోసారి. గంటా 2 నిమిషాల మ్యాచ్లో తొలి గేమ్ కోల్పోయిన భారత ప్లేయర్ రెండో గేమ్లో అద్భుతంగా ఆడాడు. కానీ డిసైడర్లో ప్రత్యర్థి ధాటిని అందుకోలేకపోయాడు. క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సింధు, లక్ష్య సేన్లకు 2,160 డాలర్ల (రూ. లక్షా 68 వేలు) చొప్పున ప్రైజ్మనీ లభించింది.