జకర్తా: ఇండోనేసియా మాస్టర్ సూపర్ - 500 టోర్నీలో ఇండియా షట్లర్ల పోరాటం ముగిసింది. సైనా నెహ్వాల్, సాయిప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సౌరభ్ వర్మలు తొలి రౌండ్లోనే ఓడి బుధవారం ఇంటిదారిపట్టగా .. తాజాగా పీవీ సింధు నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ లో ఐదో సీడ్ సింధు 21-16, 16- 21, 19- 21-19తో ప్రపంచ 14వ ర్యాంకర్ సయాక టకహషి(జపాన్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. గంటా ఆరు నిమిషాలపాటు హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్లో తెలుగు అమ్మాయి అనవసర తప్పిదాలతో పరాజయం పాలైంది.
తొలి గేమ్ గెల్చుకొని ఆధిక్యం కనబర్చిన సింధు.. సెకండ్ గేమ్లో ప్రత్యర్థిని నిలవరించడంలో విఫలమైంది. టకహషి సుదీర్ఘ ర్యాలీలు, బలమైన స్మాష్లతో విరుచుకుపడటంతో సింధు ఒకనొక దశలో గేమ్ 8-2తో వెనుకంజలో నిలిచింది. అనంతరం వరుస పాయింట్లు సాధించినప్పటికీ ప్రత్యర్థిని అందుకోలేక గేమ్ను చేజార్చుకుంది. మూడో గేమ్లో 3-3తో ప్రారంభించిన సింధు గట్టిపోటీనిచ్చింది. దీంతో ఆధిక్యం చేతులు మారుతు వచ్చింది. అయితే 18-18 గా ఉన్న సమయంలో నెట్ డ్రాప్స్తో అనవసరం తప్పిదాలు చేసిన తెలుగ అమ్మాయి.. రెండు పాయింట్ల చేజార్చుకుంది. మరొక పాయింట్ సాధించినా టకహషి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్తో పాటు మ్యాచ్ను గెలుచుకుంది. ఇక వరల్డ్ చాంపియన్షిప్ తర్వాత సింధు ఒక్క టైటిల్ కూడా నెగ్గకలేకోపోయింది. కనీసం క్వార్టర్స్ కూడా దాటలేకపోయింది. అంతేకాకుండా ఈ ఏడాది ఆమెకు ఇది వరుసగా రెండో పరాజయం. సీజన్ ఫస్ట్ టోర్నీ మలేసియా మాస్టర్స్లో సింధు క్వార్టర్స్లో నిష్క్రమించింది. మరో 7 నెలల్లో ఒలింపిక్స్ జరగనుండగా.. సింధు పేలవ ఫామ్ బ్యాడ్మింటన్ అభిమానులను కలవరపెడుతుంది.
ఇక సైనా సైనా 19-21, 13-21, 5-21తో సయాక టకహషి చేతిలోనే ఓడగా.. ప్రపంచ 12వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-18, 12-21, 14-21 తేడాతో ఆతిథ్య ఆటగాడు షేసర్ హిరెన్ రుస్తవిటో చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రణీత్ 21-16, 18-21, 10-21తో ఎనిమిదో సీడ్ షి యు కి (చైనా) చేతిలో, సౌరభ్ 17-21,21-15,21-10తో లు గ్వాంగ్ జు(చైనా) చేతిలోపరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కిరెడ్డి జంట 8-21, 14-21 తేడాతో దక్షిణ కొరియా ద్వయం కో సంగ్ హ్యూన్, ఇయోమ్ హై వోన్ చేతిలో ఓడింది.